– సీఈవో సుదర్శన్రెడ్డితో ప్రెస్క్లబ్ బృందం సమావేశం
– కొన్ని పరిష్కారాలను సూచించిన బృందం
– సానుకూలంగా స్పందించిన సీఈఓ
– ఈసీ చేపడుతున్న చర్యలను వివరించిన సీఈవో
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 :హైదరాబాద్ ప్రెస్క్లబ్ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డితో బుధవారం సమావేశమై ‘సర్’ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చింది. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు (ప్రతినిధి బృందంలోని ఒకటి లేదా ఇద్దరు సభ్యుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి), ఓటర్ల రికార్డులలో అక్షర దోషాలు, 2002 నాటి ఓటర్ల జాబితా నుండి వివరాలను సరిచూసుకోవడంలో ఇబ్బందులు, బహుభాషా నమోదులలో వ్యత్యాసాలు, బూత్ స్థాయి అధికారులలో (బీఎల్ఓలు) తగినంత అవగాహన, శిక్షణ లేకపోవడం, అన్నింటికంటే ముఖ్యంగా తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉంటాయా లేదా అనే విషయంలో పౌరులలో పెరుగుతున్న ఆందోళన వంటి అంశాలు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో తమ పేర్లు కొనసాగుతాయా లేదా పొరపాటున తొలగి అనే విషయంలో చాలా మంది పౌరులు ఆందోళనతో వున్నారని తెలిపింది. ఓటు హక్కు పరిరక్షణకు తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను సీఈఓ దృష్టికి తీసుకెళ్లింది. ఓటర్లకు శాశ్వత నివాస ధృవీకరణ పత్రం జారీ చేయడం, ప్రస్తుత గడువును పొడిగించడం, విధానాలను సరళీకరించడం ద్వారా ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితినుంచి బయటపడవచ్చునని సూచించింది. అన్ని అధికారిక ప్రయోజనాల కోసం కాకపోయినా కనీసం ఎన్నికల నమోదుకు సంబంధించిన విషయాలలో అర్హతను నిర్ధారించడానికి శాశ్వత నివాస ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. దీనివల్ల సమస్య దాదాపు పూర్తిగా పరిష్కారమవుతుందని పేర్కొంది. ఈ చర్య ముఖ్యంగా వయోవృద్ధులకు, కంప్యూటర్ పరిజ్ఞానం లేని మరియు పాక్షిక అక్షరాస్యులైన ఓటర్లకు ప్రయోజనకరమని, బూత్ స్థాయి అధికారులు పంపిణీ చేసే పొడవైన ఫారాలను పూరించడంలో తరచుగా గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కూడా బృందం తెలిపింది. చాలామంది బూత్ స్థాయి అధికారులకే మరింత విధానపరమైన స్పష్టత, శిక్షణ అవసరమని, అందువల్ల సరళమైన, పౌర-స్నేహపూర్వక ధృవీకరణ యంత్రాంగం అవసరమని, ఇది సకాలంలో జరగాల్సిన అవసరాన్ని బృందం ఆయనకు వివరించింది. ఈ ప్రతిపాదనలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్నికల శాఖ ఇప్పటికే పరిష్కరిస్తున్న అనేక సమస్యలను బృందంతో ఆయన పంచుకున్నారు. తన ముందు ఉంచిన ప్రతి సూచన, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని, వీలైనంత త్వరగా తగిన చర్య కోసం ముందుకు తీసుకువెళ్తామని సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ ప్రతినిధి బృందంలో ఎంఎల్సీ కోదండరామ్, సీనియర్ జర్నలిస్టులు కొందుభట్ల రామచంద్ర మూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య, అమర్ దేవులపల్లి, ఎ.సాయే శేఖర్, దూరదర్శన్ మాజీ ఉద్యోగులు ఎన్.వి.హనుమంత రావు, జి.కె.మూర్తి, చార్టర్డ్ అకౌంటెంట్ కె.డి. ప్రసాద్, దంత వైద్యులు డాక్టర్ ఐతరాజు భరత్ బాబు, పి.ఆర్. నిపుణుడు వనం జ్వాలా నరసింహారావు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





