హామీలను విస్మరించిన కాంగ్రెస్‌

-‌ మాఫియా నాయకుడిగా రేవంత్‌ ‌వ్యవహార శైలి
– కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పాలన సాగిస్తున్నారు
– మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో కెటిఆర్‌ ‌విమర్శలు
హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19:‌రేవంత్‌ ‌రెడ్డి అబద్దాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని ఒక మాఫియాతో పోల్చారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులవుతున్నా ఇచ్చిన గ్యారంటీల ఊసే లేదు. ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే అడ్డమైన తిట్లు తిడుతున్నారన్నారు. కేసీఆర్‌ను తిట్టుకుంటూ తిరిగితే చాలు పాలన చేయనక్కర్లేదు అనే చందాన సీఎం వ్యవహార శైలి ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పనులకు రిబ్బన్లు కట్‌ ‌చేయడానికి సీఎం తన జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి శూన్యమైందని, కేవలం అప్పులే పెరిగిపోయాయని కేటీఆర్‌ ఆరోపించారు. ఈ కొద్ది కాలంలోనే ప్రభుత్వం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదు గాని, ’హైడ్రా’ పేరుతో ఉన్న ఇళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌నాయకులను ’దండుపాళ్యం ముఠా’తో పోల్చిన ఆయన, ఈ ప్రభుత్వాన్ని ఒక మాఫియా నడుపుతోందని, ఆ మాఫియాలో రేవంత్‌ ‌రెడ్డి ఒక పిల్ల నాయకుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం దగ్గర గోనెసంచులు కూడా లేవని, ఆ సంచులన్నీ దిల్లీకి పోతున్నాయని విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన ’రైతుబంధు’ డబ్బు బంద్‌ అయిపోయిందని, ఆ పైసలన్నీ రాహుల్‌ ‌గాంధీ ఖాతాలో ’టింగ్‌ ‌టింగ్‌’ అని పడుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రైతులు ధాన్యం కుప్పలపైనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో ప్రజలకు మంచి, చెడు ఏంటో పూర్తిగా అర్థమైందన్న కేటీఆర్‌, ‌కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలంతా కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. మల్కాజ్‌గిరి ప్రజలు, బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ఎటువంటి రౌడీలు, గుండాలకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పరంగా నిలబడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
———————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *