సమ్మె ఆలోచనను వీడండి

కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవొద్దు..
సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది
గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం
మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 1: ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని మే డే వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.. ఇది  సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, ఆర్ధిక దోపిడీ కొనసాగిందన్నారు. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి.. ఏదైనా సమస్య ఉంటే మంత్రితో చర్చించండి.. వొచ్చే ఆదాయమంతా  చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి అని అన్నారు. అణాపైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు..  మీ కోసమే ఖర్చు చేస్తాం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు.. అందుకే ఒకసారి ఆలోచించండని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో సిఎం పాల్గొని ప్రసంగించారు.  కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది.

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది.. పదేళ్లు ఏం చేయని వాళ్లు వొచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దు.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు అని సూచించారు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి.. నమ్ముకున్న మీకు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. వారానికి ఒకరోజు సెలవు.. కార్మికుల పోరాట ఫలితమే అన్నారు. ఇక, తెలంగాణలో ఆర్థిక మాంద్యం తక్కువ ఉందన్నారు. సింగరేణిలో ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌కార్మికులకు మొదటి సారి మనమే బోనస్‌ ఇచ్చాం.. సింగరేణిని పదేళ్లు నిర్వీర్యం చేశారు .. కారుణ్య నియామకాలు సరళీకృతం చేశాం.. ఒక కుటుంబమే రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. కార్మికుల పట్ల వారు ఎప్పుడైనా అనుకూలంగా మాట్లాడారా?  లక్ష రెండు వేల కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు ఇచ్చాడు.. కానీ కట్టిన ముడేళ్లకే కూలి పోయిందని మండిపడ్డారు. కేసీఆర్‌ ‌చేసిన అప్పులు కట్టడానికి లక్ష రెండు వేల కోట్లు అప్పు తెచ్చాం.. వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.

ఏ పథకం అయినా ఆగిందా?.. అని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌ప్రశ్నించారు. ఇక, ఖజానా అంతా లూటీ చేసినా ఏ పథకం ఆగలేదని సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. పేద ప్రజల ఇండ్లో సన్న బియ్యం ఇస్తున్నాం.. గుజరాత్‌ ‌లో కూడా ఏడాదిలో 58 వేల ఉద్యోగాలు ఇచ్చారా?.. నేను ఇచ్చిన.. మనం దివాలా తీశాం.. కేసీఆర్‌ ‌కుటుంబం మాత్రం కోట్లు వెనకేసుకున్నారు అని ఆరోపించారు. గతంలో  ఫోన్‌ ‌లు స్వేచ్ఛగా మాట్లాడుకున్నారా.. ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు.. స్వేచ్ఛ, సంక్షేమం ఇచ్చినం మేమని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆర్టీసీ కార్మికులు పంథానికి పోకండని సూచించారు. మిమ్మల్ని ఆదుకుంటాం..  సమస్యలు మంత్రితో మాట్లాడండి.. లేదంటే నా దగ్గర ఉన్న ఖజానా కు ఇస్తా.. మీరే చూసి చెప్పండి అన్నారు. నా పరిస్థితి బడ్జెట్‌ ‌పద్మనాభం లాగా తయారైందని రేవంత్‌ ‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page