సుమారు 70 చోరీ ఘటనలపై నివేదిక
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలో దొంగతనాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఆలయ భద్రతా నిబంధనల్లో తీవ్ర లోపాలు చోటుచేసుకోవడంతో విరాళాల అపహరణకు అవకాశం కలిగిందని సిట్ పేర్కొంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆరుగురిపై ప్రాథమిక అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, వెండి ఇటుకలు సహా ఇతర విలువైన కానుకలు దుర్వినియోగానికి గురయ్యాయన్న ఆరోపణలకు మాత్రం ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక నివేదికలో సిట్ సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, బ్యాంకు పత్రాలు తదితర ఆధారాలను పరిశీలించినట్లు పేర్కొంది.ఏఎన్ఐ కథనం ప్రకారం, ఆలయ ట్రస్ట్ అధికారులు, బ్యాంకు సిబ్బంది, భద్రతా సిబ్బంది, విరాళాల లెక్కింపు సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలాలతో పాటు ట్రస్ట్ మరియు బ్యాంకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU), ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP), స్వాధీనం చేసుకున్న పత్రాలను కూడా సిట్ పరిశీలించింది. విరాళాల లెక్కింపు గదిలో నగదు లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న సమయంలో దొంగతనాలు, నగదు అపహరణలు జరిగినట్లు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నాయని సిట్ తేల్చింది. ఈ ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించగా, ఇందులోని నిర్ధారణలు సీసీటీవీ ఫుటేజ్, ఆర్థిక రికార్డులు, స్వాధీనం చేసుకున్న పత్రాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా రూపొందించినట్లు పేర్కొంది.





