దేశవ్యాప్త కులగణన చారిత్రాత్మక నిర్ణయం

గతంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలు
ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి మోసగించారు..
కుల గణనను. తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3: జనగణనలో భాగంగా కుల గణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  దేశ కులగణన చరిత్రపుటల్లో నిలిచిపోనుందని,  కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు.. రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.. కుట్రలు, కుతంత్రాలు చేశారు. ముస్లింలందరినీ.. బీసీల్లో చేర్చారు. దేశానికి స్వతంత్రం వొచ్చినప్పటి నుంచి.. ప్రజలను మతం పేరుతో విడగొడుతూ.. మతఘర్షణలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ.. కులాల పేరుతోనూ.. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేసిందని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై, బీసీలపై కపట ప్రేమను చూపించడం ఒక్కటే కాదు.. వీలు చిక్కినపుడల్లా విషం కక్కిన సందర్భాలు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఎస్సీ అయిన రామ్‌నాథ్ కోవింద్ ని, ఎస్టీ అయిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినపుడు.. వ్యతిరేకించి తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.

దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మాదిగ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించేందుకు.. మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పూర్తి వివరాలు అందజేసిన తర్వాత.. ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది. 2018లో జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుంది. 2019లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం 10% రిజర్వేషన్ ను (ఈడబ్ల్యూఎస్) అమల్లోకి తీసుకొచ్చింది. తెలంగాణ, కర్ణాటకల్లో రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన కూడా హడావుడిగా.. ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప.. ఇందులో చిత్తశుద్ధి లేదని పేర్కొంటూ  బీసీల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే.. నిష్పాక్షికమైన, సైంటిఫిక్ పద్ధతిలో కులగణన జరగాలనేదే మోదీ సర్కారు ఆలోచన. దీనికోసమే.. జనగణన వరకు వేచి చూశాం. జనగణన చేస్తున్నప్పుడే.. కులగణన సాధ్యమవుతుందన్నారు.

ఈసారి నిర్మాణాత్మకంగా జనగణన చేపట్టడం అందులో భాగంగా కులగణన జరపాలనేదే మా ప్రభుత్వ స్పష్టమైన విధానమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. మోదీ పదేళ్లలో కులగణన ఎందుకు చేయలేదు? అని రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న రాంగ్ రోల్ మోడల్ మాకు అవసరం లేదు. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి.. సమగ్రంగా జనగణ చేస్తాం.  2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడే కులగణన ఉంటుంది. రేవంత్ సర్కారు చేసిన సర్వే.. బీసీ వ్యతిరేక సర్వే. బీసీ ముస్లింలని జోడించి చేసిన సర్వేను మేం వ్యతిరేకిస్తున్నామని,  హైదరాబాద్ లో 150 కార్పొరేషన్ సీట్లలో.. బీసీలకు రిజర్వ్ చేసిన 50 సీట్లలో.. 30 సీట్లు ముస్లింలే గెలిచారని కిషన్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page