– ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితి లేదు
– ఎరువుల కోసం రైతుల తిప్పలు
– ఆరు, ఏడువేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు
– ఉద్యోగాలపై పొంతన లేని సంఖ్య చెబుతున్న మంత్రులు
– జూబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి
– వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్రంలో పాలన పడకేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం, మంత్రుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఫైర్ య్యారు. ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితే లేదని చెప్పారు. అన్నదాతలకు బోనస్, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు కూడా అందట్లేదన్నారు. ఎరువుల కోసం లైన్లో నిలబడి రైతు చనిపోయిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.73వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల అకౌంట్లలో వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే ఆ రైతుల గోస పట్టించుకోనిది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు ఇచ్చినవి ఆరు, ఏడు వేల ఉద్యోగాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. దీనిపై మంత్రులు పొంతన లేని సంఖ్య చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు. యువతులకు స్కూటీ, మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పిందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ పేరు చెప్పి ఆ డబ్బులు పురుషుల నుంచి లాక్కుంటున్నారని గుర్తుచేశారు. పదేపదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఆ రాజ్యంలో ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా వేలాది ఇళ్లను నేలమట్టం చేసిందని మండిపడ్డారు. పెద్దల ఇండ్ల జోలికి వెళ్లని హైడ్రా పేదల ఇల్లు కనిపిస్తే కూల్చివేస్తోందంటూ మండిపడ్డారు. మంత్రులు జూబ్లీహిల్స్లో గల్లీ లీడర్లలా తిరుగుతూ పాలనను పక్కన పెట్టేశారని విమర్శించారు. మరోవైపు మున్నూరు కాపులకు కేసీఆర్ ఎంతో చేశారని గుర్తు చేశారు. మున్నూరు కాపులకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని ఆయన ఫైరయ్యారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది జరుగుతుందని తాము ముందే చెప్పినా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. కనీసం ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలనైనా అమలు చేయాలని హితవు పలికారు. బీసీలకు ఏడాదికి రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడెందుకు ఇవ్వట్లేదో చెప్పాలని నిలదీశారు. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. పైసలు ఇస్తే తీసుకొని ఓటు మాత్రం బీఆర్ఎస్కు వేయాలని చెప్పారు. వారిచ్చే రెండు వేలు తీసుకొని మిగితా రూ.58వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించాలంటూ ప్రజలకు సూచించారు. దొంగ ఓట్లతో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ 12, 13వేల దొంగ ఓట్లు సృష్టించినట్లు తెలుస్తోందని ప్రజలు స్వయంగా బూత్లకు వెళ్లి ఓటు వేసి వాళ్లకు బుద్ధి చెప్పాలని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





