– తక్షణ సాయం అందించాలని మోదీకి లేఖ
న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : నేపాల్లో సంభవించిన విధ్వంసకర వరదలపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. నేపాల్లో భారీ వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని ఖర్గే పేర్కొన్నారు. వరదల కారణంగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,000 మందికి పైగా గల్లంతైనట్లు ఖర్గే తన లేఖలో తెలిపారు. వేలాది మంది ప్రజలు ఆహారం, మందులు, నివాసం, ఇతర అత్యవసర సదుపాయాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అవసరమైన మానవతా, సహాయక చర్యలను అందించాలని ఖర్గే కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి, బాధితులకు అవసరమైన ఆహారం, మందులు, నివాసం వంటి అత్యవసర సదుపాయాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వరదల కారణంగా నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు కూడా చిక్కుకుపోయారని ఖర్గే తెలిపారు. వారిని గుర్తించి సురక్షితంగా భారత్కు తరలించేందుకు రెస్క్యూ, తరలింపు చర్యలను ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేపాల్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఖర్గే తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. బాధిత ప్రజలకు మానవతా దృక్పథంతో అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని కేంద్రాన్ని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





