రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24 : పాపులను సైతం క్షమించిన క్రీస్తు.. మానవాళికి ఆదర్శనీయుడని మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధన సారాంశమని, పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. క్రీస్తు పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు, కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. ఏ నేరం చేయని తనను శిలువకెక్కిస్తున్న పాషాణ హృదయులను కూడా క్షమించమని ప్రభువును వేడుకున్న మహా త్యాగశీలి, అహింసావాది యేసు క్రీస్తు అని కేసీఆర్ కొనియాడారు.
పాపులను సైతం క్షమించే ఓర్పు, సహనం, దార్శనికత మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన శాంతి మార్గమన్నారు. విశ్వశాంతిని కాంక్షించే పరోపకారులైన ప్రతి ఒక్కరికీ యేసు బోధనలు అనుసరణీయమని అన్నారు. ద్వేషంతో నిండిపోతూ రోజు రోజుకూ స్వార్థ పూరితమవుతున్న మానవ సంబంధాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు క్రీస్తు కార్యాచరణ మార్గదర్శకంగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు.
గంగా జమున సంస్కృతి ఫరిడవిల్లేలా, మత సామరస్యం వెల్లివిరిసేలా సర్వమత సమానత్వాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం ఆచరించి చూపిందన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిష్టియన్ మైనారిటీలకు ఆనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, పలు కానుకలను అందిస్తూ క్రిస్మస్ పర్వదినాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని కేసీఆర్ గుర్తు చేశారు.