32. జనధర్మో విజయతే
జనధర్మ ప్రత్యేక సంచిక (సంపుటి 13 సంచిక 7: తేదీ 5.6.1969) సంపాదకీయం లో రేడియో ఇంటర్వ్యూ కాసు బ్రహ్మానంద రెడ్డి మరి ప్రశ్నలకు కొన్ని జవాబులు ఈ విధంగా ఉన్నాయి.
ప్రశ్న- తెలంగాణాను శీఘ్రంగా అభివృద్ధి చేయడానికి మీరు హామీఇచ్చారు ఇటీవల జిల్లాకు కోటి రూపాయల వంతున కేటాయించారు కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా ఒనగూడిన వనరులేమి లేవు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయ పరిస్థతితిని మెరుగు పరచడానికి ఆంధ్ర ప్రాంతంలో మద్యనిషేధం పూర్తిగా ఎత్తివేయడం గానీ కనీసం సడలించడంగానీ చేసే ఆలోచన ఉందా?
ముఖ్యమంత్రి – నేను శాసనసభలో కూడా మనవి చేశాను. ఆంధ్ర ప్రాంతములో వనర్లు యెక్కువ చేసుకోవలసిన అవసరం ఉన్నది అని. ఆ సందర్భంలో అనేక ఇతర పార్టీలు – అపోజిట్ పార్టీలు- కాంగ్రెసు పార్టీలో కూడా చాలా హెచ్చు ఉండి ఎక్కువగా వనర్లను ఆంధ్ర ప్రాంతం నుండి మనం సంపాదించాలంటే మద్యనిషేధం తీసివెయ్యాలనే వాదించిన విషయం మీరు అసెంబ్లీ విన్నారు. పార్టీ సమావేశాల్లో గూడా ఈ సలహాలు చేయబడుతున్నాయి. అయినా సకాలంలో ప్రభుత్వం తగు నిర్ణయం చేయనుందని కుంటున్నాను.
ప్రశ్న- వేరే మార్గాలు ఏమైనా ఆలోచిసున్నారా?
ముఖ్యమంత్రి– మార్గాలు యింకా ఉన్నాయనుకోండి. యెందుకంటే నాల్గవ ప్రణాళిక మనం జయప్రదంగా జరుపుకోవాలని అనుకున్నప్పుడు మనకు సాధ్యమయినంత వరకు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఎట్లా వనరులు పెంచుకోవాలనే విషయం ఆలోచించక తప్పదు.
విద్యార్థుల అశాంతికి కారణాలు గమనించారా?
ప్రశ్న- విద్యార్థుల గురించి ఒక ప్రశ్న. నేడు విద్యార్థుల్లో ఎక్కువగా ఉన్న అశాంతికి తరుణోపాయం ఏమిటి? పరిష్కారమార్గం ఏమయినా ఉందా ?
ముఖ్యమంత్రి- విద్యార్థుల అశాంతికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ, దేశవ్యాప్తంగా గూడా. నాకు అర్థంమయినంత వరకు అశాంతికి కారణాలు ఇవి. Extracurricular activities తక్కువ అవడం వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం- వేరే కార్యక్రమాల్లో వారు శ్రద్ధ తీసుకునే అవకాశాలు లేక పోవడం వీటివల్ల విద్యార్థులు పెడదారిని పడే అవకాశం ఏర్పడింది. మరో ముఖ్యమయిన కారణం విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించకపోతే ఉపాధ్యాయులు గూడా శ్రద్ద వహించవలసి ఉంది.
శ్రద్ధ హిస్తున్నారో లేదో కాని పెడదారికి పెడుతున్నారనే ఆ వాదం కొంచెం ఎక్కువగా ఉంది. ఆ వాదం సరయైనదో కాదో అనేది నేను చెప్పడం లేదు కాని ఇవన్నీ కలిసి ఇవాళ ఒక అశాంతి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా విద్యార్థులకు మనవిచేసేదేమంటే ఆందోళనవల్ల ఇతర పెడ మార్గాల వల్లగానీ వారు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోలేరని నేను గట్టిగా చెప్తున్నాను. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ మనస్సులో వున్నట్లయితే తప్పకుండా వృత్తి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించినప్పుడు.
యువతకు స్వాగతం
రచన: రుద్ర శ్రీ
తెలంగాణ జనయిత్రి
నియంతృత్వ నిగళమ్ములు త్రెంచ
పదిరెండేడులు పగలుగానే
బ్రమ చెందించిన కటిక చీకటుల చీల్చి
కదిలి వచ్చిన నవయువతకు
గతమంత వ్యధచెందిన జనతకు
ఇదియె స్వాగతము
సమతను గుండియలో వెలిగించి
సముజ్వల భవితవ్యాన్ని ఆశించి
ద్వేషాలు, ఆవేశాలు ప్రక్కనెట్టి
ధ్యేయం ఒకటే “జై తెలంగాణా” యని
కథలి వచ్చిన వీరయువతకు
తరలి వచ్చిన తెలంగాణ జనతకు
ఇవియే స్వాగతము
మన గడ్డ మీదనే
మన బ్రతుకు బానిసత్వం కారాదు
ప్రతి పౌరుడు ప్రతాపరుద్రుడై
పతి నారీ వీరరుద్రమ్మయై
కదలి వచ్చిన వీరయువతకు
తరలి వచ్చిన తెలంగాణ జనతకు
ఇదియె స్వాగతము
ప్రత్యేక తెలంగాణ ప్రతిపత్తి చేపట్ట
ప్రాణాల్ని సైకం ధారపోయుట కై
ప్రతినబూనిన మీకు
పౌరుషమ్ముతో తరలి వచ్చిన మీకు
ఇదియె స్వాగతము
ఈ నియంతృత్వమ్ము అణగారిపోవ
తెలంగాణము భానుబింబమై వెలుగొంద
మహోన్నతమైన మహోద్యమం నడుప
చెట్టపట్టాల్ పట్టి జేగొట్టి
కదిలి వచ్చిన వీరయువతకు
తరలి వచ్చిన తెలంగాణ జనతకు
ఇదియే స్వాగతము
(5.6.1969 జనధర్మ ఉద్యమ ప్రత్యేక సంకలన లో ఓ యువకవి కవిత)
వరంగల్ పోస్టాఫీస్ చైతన్యబిందువు
వరంగల్లు జీవితంలో పొస్టాఫీస్ చాలా గొప్ప కేంద్రం. జనం అంతా దాని చుట్టూ తిరిగింది. జనధర్మ పత్రిక ప్రతివారం గురువారం తెల్లవారుఝామున కట్టలు కట్టలు మోసుకుని పాఠకులకు పట్టణంలో అందించడం, పార్సిళ్లు పంపే కార్యక్రమం ఉంటుంది. సైకిల్ మీద కట్టలు కట్టుకుని పోస్టాఫీస్ కు చేరుకునేది. ఈ ఫోటో ఎడమ పక్కన గల్లీ ఇంట్లో ఉండేవాళ్లం. మొత్తం అన్నదమ్ములు వారి కుటుంబం అక్కడిచిన్న ఇంట్లో ఉండేవాళ్లం. పక్కన వేడివేడి కారా బూందీ, మణుగులనే పదార్థాలను తయారు చేయడాన్ని చూసేవాడిని. స్వయంగా అమ్మానాన్న వాళ్లు వండించి, పెరుమాళ్లకు నైవేద్యం చేసిన తరువాతే తినడానికి వీల్లేని రోజులు.
పక్కనే తయారైనా ఆ కారా పదార్థాలను తినడానికి వీల్లేదు. అక్కడనుంచి ముందు యం యస్ ఆచార్యగారు సైకిల్ లో పత్రిక పార్సిల్స్, పత్రిక కాపీల కట్టాలు తానే తీసుకు మోసుకునేవారు. వారి తమ్ముడు రామన్న ఈ పనులు చేసేవారివి. ఆయన తరువాత, అన్నయ్య నేను కూడా చాలా సార్లు పత్రికల కట్టలు పోస్టాఫీస్ కు తీసుకునే బాధ్యత మాకు ఉండేది. ఈ విధంగా జనధర్మతో, ఈ పోస్టాఫీస్ లో మా జీవనం ముడిపడింది. అక్కడే ఉద్యమ ఉధృత సంఘటనలు పోరాటాలు, కాల్పులు, మరణాలు, ధర్నాలు జరిగినవి. బడినుంచి బయటకు రాలేని స్థితి, అక్కడే అనేక సంఘటనలు జరిగిన ప్రాంతం పోస్టాఫీస్. చైతన్యం ఉద్దేపించే కేంద్రం ఇది. ఆ ఫోటో చూస్తేనే జ్ఞాపకాలు ప్రవహిస్తూ ఉండేవి.





