600 చ‌ద‌ర‌పు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు

ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ట్ట‌ణ ప్రాంతంలో 500 ఇండ్లు
ఈనెల 5 నుంచి 20 వ‌ర‌కు 28 మండ‌లాల్లో భూభార‌తి
నీట్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
వీడియో కాన్ఫ‌రెన్స్ లో  జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2:  ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గానికి కేటాయించిన  3,500 ఇండ్లకు ల‌బ్దిదారుల ఎంపిక  ప్ర‌క్రియ‌ను మ‌రింత‌ వేగ‌వంతం చేయాల‌ని రెవెన్యూ. హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి  క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ల‌బ్దిదారుల ఎంపిక ఎంత‌ వ‌ర‌కు పూర్త‌యితే అంత‌వ‌ర‌కు ఏరోజుకారోజు  ఇన్‌ఛార్జి మంత్రుల నుంచి ల‌బ్దిదారుల జాబితాకు  ఆమోదం తీసుకోవాల‌ని అలాగే  ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోని పట్ట‌ణ ప్రాంతంలో  క‌నీసం 500 ఇండ్ల‌ను కేటాయించి ల‌బ్దిదారులను ఎంపిక చేయాల‌ని సూచించారు.
రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణ రావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో  మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..  ఇంటి నిర్మాణం 400 చ‌ద‌ర‌పు అడుగులకు త‌గ్గ‌కుండా 600 చ‌ద‌ర‌పు అడుగుల‌కు మించ‌కుండా నిర్మాణం జ‌రిగేలా క‌లెక్ట‌ర్లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. అన‌ర్హుల‌ని తేలితే ఇండ్ల నిర్మాణం మ‌ధ్య‌లో ఉన్నాకూడా ర‌ద్దు చేస్తామ‌న్నారు. లిస్ట్‌-1, లిస్ట్‌-2 , లిస్ట్‌-3 ల‌తో సంబంధం లేకుండా నిరుపేద‌ల‌ను ఎంపిక చేయాల‌న్నారు.

రెవెన్యూ సదస్సులు
గ‌త నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు నాలుగు మండ‌లాల్లో నిర్వ‌హించినట్లుగానే ఈనెల 5 నుంచి 20 వ‌ర‌కు జిల్లాకొక మండ‌లం చొప్పున  28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌దస్సుల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. పైల‌ట్ మండ‌లాల్లో వొచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ఈనెల 31వ తేదీవ‌ర‌కు ప‌రిష్క‌రించాల‌ని , ప‌రిష్కారం కాని వాటికి ఎందుకు ప‌రిష్క‌రించ‌డం లేద‌నే విష‌యాన్ని లిఖిత పూర్వ‌కంగా తెలియ‌జేస్తూ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. 605 మండ‌లాల‌కు గాను ఇప్ప‌టి వ‌ర‌కు 590 మండ‌లాల్లో అవ‌గాహ‌నా స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించామని, ఇందులో 85,527 మంది పౌరులు, 1,62, 577 మంది రైతులు పాల్గొన్నార‌ని తెలిపారు.  ప్ర‌భుత్వ భూముల వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రికార్డుల‌లో న‌మోదు చేయాల‌ని, అసైన్డ్ ల్యాండ్‌ల‌కు సంబంధించి పొజిష‌న్ మీద ఉండి ప‌ట్టా లేనివారు, ప‌ట్టాఉండి పొజిష‌న్ మీద లేనివారి వివ‌రాల‌ను సేక‌రించాల‌ని సూచించారు.

నీట్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
విద్యార్ధుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఈనెల 4న జ‌రగ‌నున్న నీట్ ప‌రీక్ష‌కు  ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్దులు నీట్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతున్నార‌ని,  ఇందుకోసం 24 జిల్లాల్లో 190 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప‌రీక్ష కేంద్రాల్లో తాగునీరుతోపాటు ఓఆర్ఎస్ ప్యాక‌ట్లు, మెడిక‌ల్ కిట్ల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సూచ‌న‌ల‌ను ముందుగానే ప్రింట్,  ఎల‌క్ట్రానిక్ మీడియా ద్వారా ప్ర‌చారం చేయాల‌ని సూచించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, సిసిఎల్ఎ డైరెక్టర్ మకరంద్‌, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి, విపి గౌతమ్,   లా అండ్ ఆర్డ‌ర్ డిఐజి మ‌హేష్ భ‌గ‌వ‌త్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page