రాష్ట్రంలో హీట్ వేవ్ పై యాక్ష‌న్ ప్లాన్ షురూ..

వ‌డ‌దెబ్బ మ‌ర‌ణాల‌కు ఎక్స్ గ్రేషియో రూ.4 ల‌క్ష‌ల‌కు పెంపు
అన్ని ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు, మ‌జ్జిగ కేంద్రాలు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల స‌ర‌ఫ‌రా
స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
హీట్ వేవ్‌పై 12 విభాగాల‌తో స‌మీక్ష  

హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు సంబంధిత శాఖ‌లు ప‌క‌డ్బందీగా  చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఏడాది – 2025లో ఎండ‌లు, వ‌డ‌గాలులు అధికంగా వీచే అవ‌కాశం ఉంద‌ని, జూన్ వ‌ర‌కు కూడా అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని, ఐఎండి హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై సంబంధిత 12 శాఖ‌ల‌తో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి శుక్ర‌వారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తెలంగాణ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌, ఇండియ‌న్ మెట్రాలాజిక‌ల్ శాఖ క‌లిసి స‌మ‌గ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్ష‌న్ ప్లాన్ -2025 ను రూపొందించాయ‌ని ఇందులో భాగంగా ప్ర‌తి జిల్లాకు ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించార‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా  హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను మంత్రి  విడుదల చేశారు.
ఈ స‌మావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ  అధిక ఉష్ణోగ్ర‌త‌లు, వ‌డ‌గాల్పుల దృష్ట్యా  చ‌లివేంద్రాల్లో తాగునీటితోపాటు ఓఆర్ఎస్, మ‌జ్జిగ  ప్యాకెట్ల స‌ర‌ఫ‌రా చేయాల‌ని,  సిఎస్ఆర్ కింద వివిధ కంపెనీలు వీటిని స‌ర‌ఫ‌రా చేసేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నిజామాబాద్‌, కొత్త‌గూడెం, మెద‌క్‌, కరీంన‌గ‌ర్ త‌దిత‌ర ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌ధానంగా దృష్టిసారించాల‌ని  సూచించారు.

తెలంగాణలో 612 మండ‌లాల్లో 588 మండ‌లాల‌ను  వ‌డ‌గాలుల ప్ర‌భావిత ప్రాంతాలుగా  వ‌ర్గీక‌రించామ‌ని తెలంగాణ రాష్ట్రం గ‌త‌నెల 15న హీట్‌వేవ్‌ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్ట‌ర్‌గా నోటిఫై చేశామ‌ని తెలిపారు. మృతుల కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియోను రూ. 50 వేల నుంచి నాలుగు ల‌క్ష‌ల‌కు  పెంచిన‌ట్లు తెలిపారు. వ‌డ‌గాలుల ప్ర‌భావం సామాన్య‌ ప్ర‌జ‌ల‌పై ప‌డ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అయినా కూడా అనుకోని ప‌రిస్ధితుల‌లో ఎవ‌రైనా చ‌నిపోతే మాన‌వ‌తా దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించి త‌క్ష‌ణం ఎక్స్ గ్రేషియో అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. ఎండ‌ల‌కు సంబంధించిన స‌మాచారం, అధిక ఉష్ణోగ్ర‌త‌ల వేళ ప్ర‌జ‌లు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు, కూల్ వార్డుల ఏర్పాటు, దవాఖానల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వ‌హ‌ణ వంటి అంశాల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌జా ఆరోగ్య కేంద్రాలు, దవాఖానల్లో ఓఆర్ఎస్ ప్యాక‌ట్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని, ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ‌ను మంత్రి ఆదేశించారు.

అలాగే వేడి ప్ర‌దేశాల‌లో ప‌నిచేసే కార్మికుల‌ను రెండు బృందాలుగా విభ‌జించి క‌నీసం గంట లేదా రెండు గంటల విశ్రాంతి ఇచ్చేలా రొటేష‌న్ ప‌ద్ద‌తి అవ‌లంభించేలా ప‌రిశ్ర‌మ‌ల‌కు సూచించాల‌ని ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ‌కు సూచించారు.  ఘ‌న వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణా కార్మికులకు అవ‌స‌ర‌మైన విశ్రాంతి, త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ స‌దుపాయం వంటి వైద్య సౌక‌ర్యాల అందుబాటు వంటి విష‌యాల‌లో దృష్టిసారించాల‌ని కార్మిక సంక్షేమ శాఖ‌కు సూచించారు.

బ‌స్టాండ్లు, మార్కెట్లు, పర్యాట‌క కేంద్రాలు, ప్రార్ధ‌నా స్ధ‌లాల వంటి పబ్లిక్ ప్రాంతాల‌లో షెల్ట‌ర్లు, తాగునీరు, వేస‌విలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్ట‌మ్‌,ఎల్ ఇ డి స్క్రీన్ల ద్వారా ప్ర‌చారం క‌ల్పించాల‌ని స్ధానిక సంస్ద‌లు, మున్సిపాల్టీలు ముందుజాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని తెలిపారు. ముఖ్యంగా పార్కుల వ‌ద్ద ప‌క్షులు, వీధి జంతువుల కోసం నీటి స‌ర‌ఫ‌రాను స‌మ‌కూర్చాల‌ని చెప్పారు.  రాష్ట్రంలో గ్రామీణాభివృద్ది. పంచాయితీరాజ్ శాఖల త‌ర‌పున ప్ర‌జ‌ల‌కు క్లోరినేట్ చేసిన తాగునీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని, అవ‌స‌ర‌మైన ప్రాంతాల‌కు ట్యాంక‌ర్ల ద్వారా నీటిని  స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు. అదేవిధంగా స‌మాచార శాఖ‌, మ‌త్య్స‌, ప‌శుసంవ‌ర్ధక శాఖ‌, ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా, అట‌వీ, విద్యుత్ శాఖ‌ల అధికారుల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేశారు.

ఈ స‌మావేశంలో విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌,  ప్ర‌ణాళికా శాఖ ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఫైర్ సేఫ్టీ డీజీ  నాగిరెడ్డి, ఐ అండ్ పిఆర్ క‌మీష‌న‌ర్ విన‌య్‌కుమార్ రెడ్డి, నీటిపారుద‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి   లోకేష్‌కుమార్ ,గిరిజ‌న సంక్షేమ‌ శాఖ కార్య‌ద‌ర్శి శ‌ర‌త్ ,మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కార్య‌ద‌ర్శి శ్రీ‌దేవి, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ క‌మీష‌న‌ర్ సృజ‌న‌,తెలంగాణ ఐఎండి విభాగాధిప‌తి డాక్ట‌ర్ నాగ‌ర‌త్న‌,జిహెచ్ ఎం సీ క‌మీష‌న‌ర్ ఆర్ వి క‌ర్ణ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page