ఫస్టియర్లో 66.89 శాతం, సెకండియర్లో 71.37 శాతం ఉత్తీర్ణత
ఫలితాలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి
మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలన్న డిప్యూటీ సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్లో 66.89 శాతం, సెకండియర్లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈ ఏడాది పెరగడం శుభసూచకమని అన్నారు. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారని చెప్పారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,88,4430 లక్షల మంది పరీక్షలు రాయగా ఇందులో బాలికలు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 5,08,582 మంది పరీక్షలు రాయగా ఇందులో 74.21 శాతం బాలికలు 57.31% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చారు. కాగా ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు ఏమాత్రం చింత వద్దని అధైర్య ధైర్యం చెప్పారు. కాగా, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు.
కాగా ఉత్తీర్ణులైన ఇంటర్ విద్యార్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు.. ఉత్తీర్ణులైన విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు.ఉత్తీర్ణులైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ఎటువంటి పొరపాటు లేకుండా పారదర్శకంగా, విజయవంతంగా ఇంటర్ పరీక్షా ఫలితాలను వెలువరించిన అధికార బృందానికి అభినందనలు తెలిపారు.