సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి వెట్టిచాకిరీ
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో నలుగురికి విముక్తి
త్వరలోనే మరికొందరిని రప్పిస్తామన్న బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: సైబర్ నేరగాళ్లల మాయ మాటలు నమ్మి మోసపోయి బ్యాంకాక్ లో మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి వెట్టి చాకిరీకి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు. వివరాల్లోకి వెళితే… బ్యాంకాక్ లో మంచి జాబ్ ఉందని, ప్రతి నెలా రూ.లక్షల జీతం వొస్తుందని బ్రోకర్ ఆశ చూపడంతో వీరంతా నిజమేనని నమ్మి మోసపోయారు.
ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడకు చెందిన మయన్మార్ బాధితుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ఏరియాలో ఉండే యశ్ నాథ్ గౌడ్ అనే వ్యక్తి బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఉందని ఆశ చూపడంతో నిజమేనని నమ్మాం. జగిత్యాలలోని బ్రోకర్ల ఏజెంట్ ( టీం లీడర్) వంశీక్రిష్ణ వద్దకు తీసుకెళ్లాడు. వంశీక్రిష్ణే నన్ను ఇంటర్వ్యూ చేశాడు. బ్యాంకాక్ కు 200 కి.మీల దూరంలోనే జాబ్ అని చెప్పి తీసుకుపోయారు. తీరా అక్కడికి వెళితే రోజుకు 16 గంటల పని అప్పగించారు.
ఆ పని ఏందంటే సైబర్ క్రైమ్. ఆ పని చేయకపోతే భోజనం కూడా పెట్టకపోయేవారు.. ఐదు నెలలు ఆ కంపెనీలో పనిచేశాను. అలాంటి పనిచేయడం నాకిష్టం లేక మొండికేశాను. దీంతో అక్కడున్న చైనీస్ వాళ్లు నా పాస్ పోర్టు గుంజుకున్నారు. అన్నం కూడా పెట్టకుండా హింసించారు. అయినా వినకపోవడంతో వాళ్లు అక్కడున్న ఆర్మీ వాళ్లకు చెప్పి మేం దొంగతనంగా ఆ దేశానికి వొచ్చామని చెప్పి ఆర్మీ వాళ్లకు పట్టించారు. వాళ్లు మమ్ముల్ని జైల్లో వేశారు’’అని వాపోయారు. ఇటీవల మయన్మార్ నుంచి వందలాది మంది తనలాంటి బాధితులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వదేశానికి రప్పించారని తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చానని రాకేష్ రెడ్డి తెలిపారు. ‘‘మా నాన్న యాదిరెడ్డి బండి సంజయ్ సార్ కు లెటర్ రాసిన వెంటనే స్పందించి విదేశాంగ శాఖకు లేఖ రాయడంతోపాటు వెంటనే మమ్ముల్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. బండి సంజయ్ సార్ కు మా కుటుంబమంతా రుణపడి ఉంటది’’ అని పేర్కొన్నారు.
రాకేశ్ రెడ్డితోపాటు కోహెడకు చెందిన ఏ.శివశంకర్, కరీంనగర్ జిల్లాకు చెందిన కనూరి గణేశ్ తోపాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆకుల గురు యువ కిశోర్ బ్రోకర్ల బారిన పడి మయన్మార్ లో సైబర్ క్రైం వెట్టి చాకిరీ చేస్తూ తీవ్రమైన హింసలకు గురయ్యారు. వీరంతా బండి సంజయ్ కార్యాలయ చొరవతో స్వదేశానికి తిరిగి వొచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మయన్మార్ లో పలువురు తెలుగు రాష్ట్రాల యువతతోపాటు వందలాది మంది భారతీయులు సైబర్ క్రైమ్ వెట్టి చాకిరీ చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, త్వరలోనే వారందరినీ స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.