నభూతో న భవిష్యత్తు అన్నట్టు నిర్వహించండి
తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పుట్టడం మన అదృష్టం..
కాంగ్రెస్ హయాంలోనే సినీ పరిశ్రమకు ప్రోత్సాహం
గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : గద్దర్ సినిమా అవార్డుల వేడుకలను నభూతో నా భవిష్యత్ అనేలా నిర్వహించాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భరోసా ఇచ్చారు. మంగళవారం ఎల్వీ ప్రసాద్ సినీ ల్యాబ్ లో నిర్వహించిన గద్దర్ అవార్డుల జ్యూరీ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో సినిమా అవార్డుల ఫంక్షన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గద్దర్ సినిమా అవార్డుల కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించబోయే గద్దర్ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవాల గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలా నిర్వహించాలని కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ నిరాదరణకు గురైందన్నారు. 2011లో చలనచిత్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయి ప్రోత్సాహం కరువైందని అన్నారు.
తెలంగాణలో గద్దర్ పుట్టడం మన అదృష్టమని దశాబ్దానికి ఒకరు అలాంటి మహానుభావులు పుడతారని కొనియాడారు. తెలంగాణ సంస్కృతి, గుండె చప్పుడును విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు గద్దర్ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతి భావజాలాన్ని రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి స్పష్టమైన మార్గంలో గద్దర్ ప్రచారం చేశారని వివరించారు. ఆయన బాణిని చిన్నపిల్లలు నుంచి ముసలి వాడి వరకు అనుకరించారని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ తో గద్దర్ పాదయాత్ర చేసి ప్రత్యేక రాష్ట్రానికి నాంది పలికారని వివరించారు. ఎక్కడో ఉన్న చిత్ర పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కు తరలించి ప్రోత్సహించిందని గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమను తరలించి ప్రోత్సాహకాలు అందించడమే కాదు.. సినీ పరిశ్రమలో పనిచేసే వారికి ఇళ్ల స్థలాలను సైతం కేటాయించామని అన్నారు.
సమాజంలో అభివృద్ధి, విలువలను ప్రోత్సహించేది మీడియానే, మీడియాను కాపాడుకునే బాధ్యత పాలకులపై ఉందని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు బాధ్యత గల ప్రభుత్వాలు బలమైన సినిమా రంగం ద్వారానే సమాజానికి సందేశం ఇవ్వాలని అని ముఖ్యమంత్రి తో పాటు యావత్ క్యాబినెట్ నిర్ణయించి దశబ్ద కాలంగా ప్రోత్సాహకానికి నోచుకోని సినీ రంగానికి చేయూతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భవ బంధాలు, రాగద్వేషాలకు అతీతంగా అవార్డులకు సినిమాలను ఎంపిక చేయాలని జూరీ సభ్యులను డిప్యూటీ సీఎం కోరారు. సినిమా అవార్డులతో పాటు సినీ పరిశ్రమకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన వ్యక్తుల పేరిట అవార్డులు ఇస్తున్నామని ఇవి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు.