– తెలంగాణ వరి ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్
- రైతులు వాటినే పండించేలా దిశా నిర్దేశం
– మిల్లర్లు కొనుగోలు చేసే రకాలను పండిస్తే మేలు
– ఇందుకోసం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
– కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటి సిఎం భట్టి సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: రాష్ట్రంలో 8 మేలురకం వరి వంగడాల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విదేశాల్లో తెలంగాణ బియ్యానికి బాగా డిమాండ్ ఉందని, మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని వెల్లడించారు. సోనామసూరి సహా ఎగుమతులకు అనుకూలమైన వరి రకాలపై రైతన్నలు దృష్టిపెట్టాలని సూచించారు. ఇందుకోసం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజాభవన్లో భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఎగుమతి రకాల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ నిపుణుల కీలక సూచనలు చేశారని తెలిపారు. ఆ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు వస్తాయని వివరించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న వరి రకాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ ఉన్న బియ్యం ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచే పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామస్థాయిలో రైతులకు చైతన్య సదస్సులు నిర్వహించాలని సూచించారు. రైతులకు మార్కెట్ ఆధారిత పంటల సాగుపై మార్గనిర్దేశర చేయాలని నిర్ణయించామని అన్నారు. డిమాండ్ లేని వరి రకాల సాగును క్రమంగా తగ్గించాలని చెప్పారు. వినియోగదారులు, మిల్లర్లు కోరుకునే వరి రకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎగుమతులకు అనుకూలమైన నిర్దిష్ట వరి రకాల సాగు విస్తరణపై దృష్టి పెట్టాలని భట్టి విక్రమార్క మార్గనిర్దేశం చేశారు. వానాకాలం సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు పక్రియను కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రైతులకు నష్టాలు రాకుండా మార్కెట్ అవసరాలకనుగుణంగా పంటల ప్రణాళిక చేపట్టాలని సూచించారు. నాణ్యమైన బియ్యం ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని నిర్ణయించామని చెప్పారు. రైతులకు లాభదాయకమైన, ఎగుమతి అవకాశాలు ఉన్న వంగడాలపై ప్రత్యేక ప్రోత్సాహకాలని పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలపై నిరంతర సమీక్షా సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రాన్ని అధిక విలువ కలిగిన వరి ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. రైతు ఆదాయం పెంపు, మార్కెట్ అనుసంధానానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించామన్నారు. రైతులకు మెరుగైన ధరలు వచ్చేలా మార్కెట్ డిమాండ్ ఆధారిత వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని భట్టి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.