– కడుపులో కత్తులు పెట్టుకుని నవ్వుతూ మాట్లాడలేను
– తెలంగాణ అప్పులపై చర్చకు సిద్ధమే
– మీట్ ద ప్రెస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పాదయాత్ర మొదలయ్యేలోపు ఫిట్ అవ్వాలని చూస్తున్నానని చమత్కరించారు. వచ్చే ఏడాది పాదయాత్ర ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుందని కేటీఆర్ తెలిపారు. 2027లో కచ్చితంగా పాదయాత్ర ఉంటుందని పునరుద్ఘాటించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ టైమ్లో పాదయాత్ర చేయాలనే దానిపై పార్టీలో పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కడుపులో కత్తులు పెట్టుకుని.. పెదవులపై చిరునవ్వులు పెట్టుకునే తెలివితేటలు తనకు లేవని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. అందుకే తనకు అహంకారమని అంటారేమో అని తెలిపారు. మీకు అహంకారమని అంతా అనుకుంటారని ఇంటర్వ్యూల్లో చెప్పారు కదా.. దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ మేరకు స్పందించారు. నాకు అహంకారమని అంతా ఎందుకు అనుకుంటారని కచ్చితంగా ఆలోచిస్తుంటానని కేటీఆర్ తెలిపారు. అయితే కొంతమందికి కొన్ని కొన్ని మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటాయని అన్నారు. అలాగే తనకు బాడీ లాంగ్వేజ్ సమస్య ఉందని తెలిపారు. అందుకే నవ్వుతూ మాట్లాడమని మిత్రులు చెబుతుంటారని.. కానీ అలా లేని నవ్వు తెచ్చుకుని నాకు మాట్లాడటం రాదని చెప్పారు. తెలంగాణ వాడిని కదా.. కడపులో కత్తులు, పెదవులపై చిరునవ్వులు పెట్టుకునే తెలివితేటలు తనకు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధిలో నంబర్వన్గా ఎదిగిందని పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ది ఏ రాష్ట్రంలో జరగలేదని స్పష్టం చేశారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు. రెండేళ్లుగా ప్రభుత్వ ఆదాయం పతనమవుతోందని తెలిపారు. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు అర్థమైందని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూనే ప్రభుత్వ ప్రకటనల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పు రూ.2.8 లక్షలు మాత్రమేనని తెలిపారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ రూ.4లక్షల కోట్ల అప్పులు చేసిందని పేర్కొన్నారు. అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించారు. అప్పు చేసి తీసుకొచ్చిన ఈ డబ్బంతా ఎక్కడికి పోతున్నదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు తీరుస్తున్నామని కాంగ్రెస్ చెబుతున్నవన్నీ కాకిలెక్కలు అని కేటీఆర్ అన్నారు. ఏడాది కాలంలో రూ.29వేల కోట్ల అప్పు మాత్రమే తీర్చారని తెలిపారు. నెలకు రూ.6వేల కోట్ల అప్పు తీరుస్తాన్నమనేది అబద్ధమని స్పష్టం చేశారు. రూ.2వేల కోట్లే చెల్లిస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వల్ల తెలంగాణకు ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరించారు. రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





