గ‌తంలో నిలిపిన రైళ్ల‌కు తిరిగి హాల్టింగ్ ఇవ్వాలి

– వేం న‌రేంద‌ర్‌రెడ్డికి ప్ర‌యాణికుల సంఘం విన‌తి

కేస‌ముద్రం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24: ప్రస్తుతం కేసముద్రం రైల్వే స్టేషన్‌లో 19 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయ‌ని, దీనివల్ల వేలాదిమంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్ర‌యాణికుల సంఘం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో కోవిడ్‌కు ముందు కేస‌ముద్రంలో నిలిపిన రైళ్ల‌కు తిరిగి హాల్టింగ్ ఇచ్చేవిధంగా ప్ర‌య‌త్నించాల‌ని రాజ్య‌స‌భ స‌భ్యు-డు వేం న‌రేంద‌ర్‌రెడ్డికి స్థానిక ప్ర‌యాణికుల సంఘం లిఖిత‌పూర్వ‌కంగా విజ్ఞ‌ప్తి చేసింది. కేసముద్రం ఇటీవల మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన విష‌యాన్ని, ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ హాస్పిట‌ల్‌ వంటి ముఖ్యమైన సంస్థలు ఏర్పాటైన అంశాల‌ను సంఘం నాయ‌కులు ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార‌ణంగా రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింద‌న్నారు. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన ప్రాంతాలకు మెరుగైన రైలు సౌకర్యం కల్పించాలనే డిమాండ్ పెరుగుతోందన్నారు. కోవిడ్ మహమ్మారికి ముందు కేసముద్రం స్టేషన్‌లో  తిరుపతి – సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్(12763),. 12745 సికింద్రాబాద్-మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12745),  మణుగూరు -సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12746 ), మచిలీపట్నం – బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12749),  బీదర్ – మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12750), మహబూబ్‌నగర్ – విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12862), విశాఖపట్నం – మహబూబ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12861) ఆగేవ‌ని తెలిపారు. ప్రజల అత్యవసర డిమాండ్, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిలిపివేసిన రైళ్ల‌తోపాటు గుంటూరు -సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌- గుంటూరు ఇంట‌ర్ సిటీ ఎక్స్ ప్రెస్‌ను కేసముద్రంలో నిల‌పాల‌ని ప్ర‌యాణికులు విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాక అధిక‌ సంఖ్యలో ప్రయాణికులు ప్లాట్‌ఫాం నంబర్లు 2, 3 వైపు నుండి స్టేషన్‌కు వస్తుంటారు కాబట్టి ప్రయాణికుల సౌకర్యార్థం ఆ వైపున ఏటీవీఎం(ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్) ఏర్పాటు చేయాలని కోరారు. ప్రయాణికులు రైలు రాకకు ముందే రైలు బోగీల స్థానాన్ని సులభంగా గుర్తించడానికి వీలుగా కోచ్ స్థాన ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా వారు అభ్య‌ర్థించారు. ఈ విషయాన్ని సంబంధిత రైల్వే అధికారులతో చర్చించి పై డిమాండ్ల అమలుకు వీలు కల్పించాలని వారు న‌రేంద‌ర్‌రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *