– 27 లక్షల మంది విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ
– రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం ఒక చరిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన వస్తువులతో కూడిన విద్యా కిట్లను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇది కేవలం ఒక రోజువారీ ప్రభుత్వ కార్యక్రమం కాదని, దశాబ్దాలుగా ఉన్న విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు, విద్యార్థుల ఆత్మగౌరవానికి ప్రతీక అని డిప్యూటీ సీఎం అన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా కిట్లను ప్రజాప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఈ కిట్లో అందించే బూట్లు, యూనిఫామ్, పుస్తకాలు, బెడ్ షీట్స్ వంటి ప్రతీ వస్తువును అత్యంత నాణ్యతతో రూపొందించినట్లు ప్రకటించారు. గత ప్రభుత్వాల మాదిరగా మొక్కుబడిగా కాకుండా ప్రజాధనంలోని ప్రతి పైసాకు జవాబుదారీతనంగా ఈ వస్తువులను విద్యార్థులకు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒక తండ్రిలా బాధ్యత తీసుకొని ఈ కిట్లను అందిస్తున్నారన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్ కేవలం ఒక వస్త్రం ముక్క కాదు.. తాము ఇస్తున్న బూట్లు కేవలం కాళ్లకు వేసుకునేవి కావు.. అవి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సమాజంలో మేమెవరికీ తక్కువ కాదని ధైర్యంగా, సగర్వంగా తల ఎత్తుకుని తిరిగేలా చేసే ఆత్మగౌరవ ప్రతీకలుగా ఆయన అభివర్ణించారు.
ప్రపంచంతో పోటీ పడేలా యంగ్ ఇండియా స్కూల్స్
విద్యా బుద్ధులతోపాటు విద్యార్థుల ఆహార్యం, మౌలిక వసతులు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని, ఇందులో భాగంగానే ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రూ.200 కోట్ల భారీ వ్యయంతో ప్రపంచ Í్థయి వసతులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఒకేసారి వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసిందని భట్టి చెప్పారు. ఇటీవలే ఆరుట్ల గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు చేతుల మీదుగా ప్రారంభమైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ దీనికి సజీవ సాక్ష్యం. అక్కడ నిర్మించిన అత్యాధునిక కిచెన్ ఏ కార్పొరేట్ స్కూల్లోనూ లేని విధంగా ఉందన్నారు. భవిష్యత్తులో ని ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇదే రీతిన మారబోతున్నాయని చెప్పారు.
విపక్షాలపై ఘాటు విమర్శలు
రాష్ట్రంలో పేద, బలహీనవర్గాల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతుంటే ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేలడంపై ఆయన తీవ్రంగా మండిసడ్డారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి, ప్రపంచంతో పోటీపడుతున్న విద్యార్థులను చూసి అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు.
నిరంతరాయంగా విద్యా యజ్ఞం
ఈ విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం ఇందిరమ్మ ప్రభుత్వానికి అత్యంత ప్రియమైనదని, ఇది నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, తెలంగాణ సమాజానికి భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





