– మానుకోట జిల్లాలో జనరల్గా మారిన ఏకైక మండలం
– జడ్పీ చైర్మన్ పదవి కూడా జనరల్ కావడంతో పెరిగిన ప్రాధాన్యం
– వేం నరేందర్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి రంగప్రవేశం చేయనున్నారనే ప్రచారం
– సీతక్క, నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత రాజకీయ అనుబంధం
– బీఆర్ఎస్ సైతం గంగారం మండలంపై గురి
మహబూబాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : మానుకోట జిల్లాలో 18 మండలాలు ఉండగా అందులో ఒక్క గంగారం మండలానికి మాత్రమే జనరల్ అయింది దీనికి తోడు జడ్పీ చైర్మన్ కూడా జనరల్ కావడంతో గంగారం మండలానికి అధిక ప్రాధాన్యం పెరిగింది. జడ్పీటీసీకి సంబంధించి జిల్లాలో ఏకైక మండలం గంగారం మాత్రమే జనరల్ అయింది. దీంతో గిరిజనేతరులలో బలమైన రెడ్డి సామాజిక వర్గం ఈ మండలంపై గురిపెట్టింది. ఎందుకంటే జడ్పీ చైర్మన్ కూడా జనరల్ అయింది. ఇలాంటి స్థితిలో వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దని దృఢ సంకల్పంతో ఉన్న రెడ్డి సామాజిక వర్గం.. అప్పుడే గంగారంలో పావులు కదుపుతోంది. మహబూబాబాద్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా గ్రామాలలో వీరి ఆధిపత్యమే ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ రెడ్డి సామాజిక వర్గం అనుగ్రహం లేకుండా ప్రజాప్రతినిధి గెలవడం అంత సులువు కాదు. గంగారం మండలం ములుగు నియోజకవర్గంలో ఉంది ఈ నియోజకవర్గానికి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ బలంగానే ఉంటుంది. మండలంలో 9 వోట్లు ఉండగా ఇందులో గిజనేతరులు 15000 లంబాడీ సామాజిక వర్గాన్ని 15000 దాదాపు 6000 ఆదివాసీలే ఉంటారు. ఆదివాసీల్లో సీతక్కకు బలమైన పట్టు ఉంది. ఆమె కూడా అదే సామాజిక వర్గానికి కావడం కూడా ఒక కారణం. ఇలాంటి స్థితిలో ఇదే జిల్లాకు చెందిన సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తన తనయుడు భార్గవ్ రెడ్డిని రంగంలోకి దింపి జడ్పీ చైర్మన్ ను చేయాలని సంకల్పంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి సీతక్క ఈ ముగ్గురు గతంలో టీడీపీలో ఉన్నారు. ఒక కుటుంబ సభ్యులు గానే ఉండటమే గాక ముగ్గురూ ఒకేసారి ఒకేసారి కాంగ్రెస్లో చేరారు. సీతక్కను వీరు తమ ఆడబిడ్డగా భావిస్తుంటారు. కుటుంబ అనుబంధంగా ఉన్న ఈ ముగ్గురు బలమైన నాయకులు. ఇలాంటి స్థితిలో వేం నరేందర్ రెడ్డి తనయుడు గంగారంలో పోటీ చేస్తానంటే సీతక్క కాదనకపోవచ్చు. అయితే స్థానిక నాయకత్వం మాత్రం.. వలస వచ్చే వారికి అవకాశం ఇవ్వబోమని, తామే పోటీలో ఉంటామని తెగేసి చెబుతున్నారు. అయినప్పటికీ సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. ఎందుకంటే పోటీదారులకు ఏదో ఒక నామినేట్ పోస్ట్ ఇస్తానంటే సర్దుకోవచ్చు. మొత్తానికి గంగారం మండలం మానుకోట జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే పార్టీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాడు. ఇదే మండలంపై బీఆర్ఎస్ కూడా గురి పెట్టింది. గంగారం మండలం నుంచి మహబూబాబాద్ మండలానికి చెందిన కెఎస్ఎన్ రెడ్డి బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. కెఎస్ఎన్ రెడ్డికి బీఆర్ఎస్ లోని అందరి మద్దతు సంపూర్ణంగా ఉంది. దీనికి తోడు ఆర్థికంగా బలమైన వ్యక్తి మరొకరు పోటీకి సిద్ధంగా ఉన్నాడు. దివంగత నేత నూకల నరేష్ రెడ్డి తనయుడు కూడా పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు .మొత్తానికి గంగారం మండలంపై రెడ్డి సామాజిక వర్గం గురిపెట్టి కూర్చుంది. అయితే కోర్టు తీర్పు తర్వాతనే తమ ప్రయత్నాలను తీవ్రం చేసే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం రావడానికి గంగారం మండల ప్రజలు ఆహ్వానిస్తారో లేదంటే అన్ని పార్టీలలోని గిరిజనులు తిరస్కరిస్తారో చూడాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





