సుస్థిర విధానాలతో ముందుకెళ్తున్నాం..

సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రత్యేక గుర్తింపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హిరోషిమాను సందర్శించిన తెలంగాణ బృందం
హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ మొబిలిటీ కారిడార్ పై దృష్టి
పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం జపాన్‌లోని హిరోషిమా ప్రి ఫెక్చర్ (రాష్ట్ర ప్రభుత్వం) ను సందర్శించింది. ఈ సందర్భంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హిరోషిమా ప్రభుత్వ ఆతిథ్యానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని అన్నారు. తెలంగాణ కూడా కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ, హిరోషిమా కలిసి పని చేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.

వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగు నీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులు,  అర్బన్ ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రస్తావించారు.  వీటితో పాటు విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతి, శాంతి, పర్యాటకం, పీస్ పార్క్, సాంస్కృతిక ప్రదర్శనలు,  బౌద్ధ వారసత్వానికి సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page