బిఆర్ఎస్ బాయ్కాట్ .. తేలని కాంగ్రెస్ వ్యూహం..
క్రాస్ వోటింగ్ పై ఆశాభావంతో బిజెపి
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నికకు బుధవారం వోటింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కేవలం రెండు పార్టీలు మాత్రమే బరిలో నిలిచాయి. పోటీ పడుతున్న ఎంఐఎం, బిజెపిలు ఎవరికివారే గెలుపు ధీమా ప్రకటిస్తున్నారు. వాస్తవానికి బిజెపి తమఅభ్యర్థిని గెలిపించుకునేంత సంఖ్యా బలం లేకున్నా, చివరి నిమిషంలో ఎదో మిస్టరీ జరగకపోతుందా అన్న ఆశాభావంతో ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ తమ అభ్యర్థిని పోటీ పెట్టలేదు. పైగా ఎన్నికల్లో పాల్గొనవద్దని తాజాగా తమ కార్పొరేటర్లకు విప్ కూడా జారీ చేసింది. ఎన్నిక ప్రాంగణం వైపు కూడా వెళ్లొద్దని ఆ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కెటిఆర్ పేర్కొనడం గమనార్హం. దీంతో ఎట్టి పరిస్థితిలో బిఆర్ఎస్ వోటింగ్లో పాల్గొనే అవకాశం లేదు.
ఇకపోతే రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. బిఆర్ఎస్ లాగానే తమకు కూడా తగినంత సంఖ్యా బలం లేకపోవడం వల్లే అభ్యర్థిని పోటీపెట్టలేకపోయామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఎంఐఎం, బిజెపిల మధ్య పోటీ అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం వోటర్ల సంఖ్య ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 112. కాగా పార్టీల వారీగా పరిశీలిస్తే, మిగతా అన్ని పార్టీలకన్నా వోటర్ల సంఖ్యలో ఎంఐఎం ముందు ఉన్నది. ఆ పార్టీకి 49 మంది సభ్యులుండగా, బిఆర్ఎస్కు 25, బిజెపికి 22, కాంగ్రెస్కు 14 మంది వోటర్లున్నారు. అంటే ఎంఐఎంతో పోటీ పడగల సంఖ్యా బలం ఇతర ఏ పార్టీలకూ లేదనే చెప్పాలి. ఇందులో బిఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని పోటీపెట్టకపోగా, ఎన్నికలనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో వారికున్న 25 మంది వోటర్ల సంఖ్యపోను వోటింగ్లో పాల్గొనేవారి సంఖ్య 87కు తగ్గినట్లైంది. అంటే ఎంఎల్సీ అభ్యర్థికి గెలుపునకు కనీసం 44 లేదా 45 వోట్లు పడాల్సి ఉంటుంది. బిజెపి ఆ సంఖ్యకు చేరుకోవాలంటే మరో 23 మంది వోటర్లను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యపడే అవకాశాలు కనిపించడంలేదు. అయినా బిజెపి పోటీలో ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. ఏదైనా మిరాకిల్ జరగకపోతుందా అన్న ఆశతో ముందుకు పోతున్నది. క్రాస్ వోటింగ్ జరిగే అవకాశాలేమైనా ఉన్నాయా అన్నకోణంలో ఆపార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ ఇప్పటికే వోటింగ్లో పాల్గొనవద్దని తమ వోటర్లకు విప్ జారిచేసింది.
ఇకపోతే కాంగ్రెస్ వోట్లు ఎటువైపు పడుతాయన్నది తేలాల్సిఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చినప్పటి నుంచి ఎంఐఎం అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ బాహాటంగా ప్రకటించకపోయినా ఆ పార్టీ మద్దతు ఎంఐఎంకే ఉంటుందన్న విషయాన్ని ఇప్పటికే బిజెపి నేతలు ఆరోపిస్తునే ఉన్నారు. ఎంఐఎంను గెలిపించేందుకే బిఆర్ఎస్, కాంగ్రెస్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని, ఆ మూడు పార్టీలు ఒకటేనంటోంది బిజెపి. ఇదిలాఉంటే కాంగ్రెస్, బిఆర్ఎస్ల నుంచి పార్టీలు మారిన కార్పొరేటర్ల వోటింగ్పై బిజెపి దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. వారిలో ఒకరిద్దరు తమతో కలిసినా కొంతవరకు మరింత బలాన్ని తాము చేకూర్చుకున్నట్లే అవుతుందన్న భావన బిజెపి ఉన్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే సెంటిమెంట్ రాజేయడానికి ప్రయత్నిస్తోంది.
ఎంఐఎంకు వోటేస్తే తమను కార్పొరేటర్లుగా ఎన్నుకున్న హిందూ ప్రజలకు ద్రోహం చేసినట్లేనంటూ ప్రచారం చేస్తూ వొచ్చింది. అంతేకాకుండా ఆత్మ వంచన చేసుకోకుండా అత్మప్రబోధంతో తమ వోటు హక్కును వినియోగించుకోవాలన్న ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఎంఐఎంకు వోటు వేస్తే హిందూ ధర్మానికి వోటు వేయనట్లేనని హెచ్చరిస్తోంది. తమకు సంఖ్యాబలం లేకున్నా హిందూధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశంగా అభ్యర్థి గౌతంరావును నిలబెట్టామంటోంది. తమకన్నా సంఖ్యాబలం ఎక్కువున్నప్పటికీ బిఆర్ఎస్, కాంగ్రెస్లు తమ అభ్యర్ధులను నిలబెట్టకుండా పరోక్షంగా ఎంఐఎంకు సహకరించడం పట్ల బిజెపి కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను అవమానించే పక్కా మతోన్మాద పార్టీ అయిన మజ్లిస్కు మద్దతు పలకడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ రెండు పార్టీలకు సూపర్బాస్లా మారిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఈ పార్టీల అధినేతలు వంగివంగి సలామ్లు చేస్తున్నారని, అలాంటప్పుడు తమవి సెక్యులర్ పార్టీలని ఎలా చెప్పుకుంటారని కిషన్రెడ్డి ఆయాపార్టీల అధినాయత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.