మేడారం మహా జాతరకు శాశ్వత పనులు చేపట్టాలి

మహా మేడారం జాతరకు రూ.145 కోట్ల పనులు
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయండి
క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : వొచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరిగే మేడారం మహా జాతరకు వొచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మహా జాతరకు ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.145 కోట్ల కేటాయించనుందని తెలిపారు. 2026-మేడారం మహా జాతరను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర టి.ఎస్. అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలు చేపట్టనున్న పనులను మంత్రికి వివరించారు.

అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గతంలో లాగా జాతరకు రెండు నెలల ముందు పనులు ప్రారంభించి హడావిడిగా పనులు చేయకుండా కనీసం ఆరు నెలల సమయం తీసుకుని పూర్తి నాణ్యతతో పనులు ముగించాలని సూచించారు. వొచ్చే సంవత్సరంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర తో పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నామని, రెండు పెద్ద పండుగలను పురస్కరించుకొని అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కుంభమేలా తరహాలో జరుగుతున్న  మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతానికి  కృషి చేయాలన్నారు.

గత మహా జాతర సందర్భంగా మిగిలి ఉన్న రూ.50 కోట్లను రానున్న మహా జాతరకు వినియోగిస్తామని తెలిపారు. గద్దెల పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా జంపన్న వాగు వద్ద రూ.5 కోట్లతో  పెద్దలు, పిల్లలు సేద తీర్చుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులకు అవసరమయ్యే పనులను ముందుగానే గుర్తించి అధికారులు అంచనాలు తయారు చేయాలని, మహా జాతర సందర్భంగా రైతులకు అవగాహన నిర్వహించాలన్నారు. జాతర సందర్భంగా తాగునీరు , మరుగుదొడ్ల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ  గతంలో జరిగిన మేడారం మహా జాతర సందర్భంగా పనిచేసిన అధికారులు ఇప్పటికీ జిల్లాలో పనిచేస్తున్నారని, వారి అనుభవాలను పరిగణలోకి తీసుకొని రానున్న మహా జాతరను విజయవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. పలు శాఖల ద్వారా చేపట్టనున్న పనులను గుర్తించి అంచనాలను తయారు చేస్తామని తెలిపారు. గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం  కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  సమావేశంలో ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ రెవిన్యూ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ములుగు డిఎస్పి రవీందర్, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఎఫ్ డి ఓ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page