ఆదానీ లంచం కేసులో ఫెడరల్‌ ‌కోర్టు కీలక నిర్ణయం

– కేసు ఉపసహంరణకు నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశం

న్యూయార్క్,‌ జూన్‌ 27: ‌బిలియనీర్‌ ‌గౌతమ్‌ అదానీ పై నమోదైన హై-ప్రొఫైల్‌ ‌లంచం కేసులో అమెరికా ఫెడరల్‌ ‌కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతోపాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్‌ ఆరోపణలను తక్షణమే కొట్టివేసేందుకు ఫెడరల్‌ ‌జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో తెలుపుతూ మరింత స్పష్టమైన, వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని అమెరికా జస్టిస్‌ ‌డిపార్ట్‌మెంట్‌ను కోర్టు ఆదేశించింది. బ్రూక్లిన్‌ ‌లోని యూఎస్‌ ‌డిస్ట్రిక్ట్ ‌జడ్జి నికోలస్‌ ‌గరాఫిస్‌ ఈ ‌మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసును ఉపసంహరించుకోవాలంటూ మే 18న జస్టిస్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌ ‌చాలా క్లుప్తంగా, ఎలాంటి బలమైన కారణాలు లేకుండా ఉందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. కేసును ఎందుకు డ్రాప్‌ ‌చేయాలనుకుం టున్నారో సరైన ఆధారాలు, కారణాలతో కూడిన నివేదికను జూలై 13 లోగా కోర్టుకు సమర్పించాలని ప్రాసిక్యూటర్లను ఆదేశించారు. భారత్‌లో సౌర విద్యుత్‌ ‌ప్రాజెక్టుల ఆమోదం కోసం ప్రభుత్వ అధికారులకు వందల మిలియన్‌ ‌డాలర్ల లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారని, అలాగే అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌ అదానీపై 2024లో అమెరికాలో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ ‌మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. మే నెలలో ట్రంప్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ కేసుపై మరింత సమయం, వనరులను కేటాయించలేమని పేర్కొంటూ కేసును పూర్తిగా ఉపసంహరించుకోవాలని జస్టిస్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌భావించింది. జూన్‌ 24‌న అదానీ తరపు న్యాయవాదులు కూడా ఈ కేసు అమెరికా అధికార పరిధిలోకి రాదని, లంచం ఇచ్చినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును అధికారికంగా కొట్టివేయాలని కోర్టును కోరారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం నుంచి పూర్తి వివరణ కావాలని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఈ క్రిమినల్‌ ‌కేసు పక్రియ ఇలా ఉండగా.. దీనికి సమాంతరంగా నడుస్తున్న సివిల్‌ ‌వివాదాల పరిష్కారానికి అదానీ గ్రూప్‌ అం‌గీకరించింది. ఇందులో భాగంగా గౌతమ్‌ అదానీ 6 మిలియన్‌ ‌డాలర్లు, సాగర్‌ అదానీ 12 మిలియన్‌ ‌డాలర్ల మేర సివిల్‌ ‌సెటిల్‌మెంట్‌ ‌కింద చెల్లించే ప్రతిపాదనలు కోర్టు అనుమతి కోసం వేచి ఉన్నాయి. ఇవి కాకుండా ఇరాన్‌ ‌నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్‌ ‌దిగుమతులకు సంబంధించి అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణల పరిష్కారానికిగాను అదానీ ఎంటర్‌‌ప్రైజెస్‌ అమెరికా ట్రెజరీకి 275 మిలియన్‌ ‌డాలర్లు చెల్లించడానికి ఒప్పుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *