న్యూదిల్లీ, జూన్ 26: అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్లో పేర్లున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి వివరాలను రాబట్టేందుకు విచారణ చేపడుతున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు, రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో సిట్ దర్యాప్తు అంత సంతృప్తిగా లేదని అయోధ్య ఆలయ పూజారులు అసహనం వ్యక్తం చేశారు.అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై ఏర్పాటైన సిట్ రెండు రోజుల క్రితం తమ ప్రాథమిక నివేదికను ఉత్తర్ప్రదేశ్ సర్కారుకు సమర్పించింది. నిందితులపై కఠినమైన చర్యలకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఎనిమిది మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారిని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తుల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ‘‘అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాశ్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్లపై ఎఫ్ఐఆర్లో నమోదైంది. వీరంతా ఆలయానికి వచ్చిన విరాళాలు, విలువైన వస్తువులను లెక్కించే ప్రక్రియలో పాలుపంచుకున్నారు. గురువారం రాత్రి ఈ ఎనిమిది మందిని అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది. నిందితులందర్నీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రామమందిర విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో అయోధ్య పూజారులు కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని త్వరగా, పారదర్శకంగా ముగించాలని కోరుతున్నారు.సిట్ దర్యాప్తు తీరుపై ఆధ్యాత్మిక ప్రవచనకర్త కర్పత్రి మహారాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తుతో తాను సంతృప్తి చెందలేదన్నారు. బాధితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కోరారు. నిందితులను అయోధ్య విడిచి వెళ్లేలా చేయాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదిక సమర్పించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్లో ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి. ఈ కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవేళ ఎవరైనా దోషులుగా తేలితే వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలి. నిందితులపై తీసుకునే చర్యలు రాబోయే శతాబ్దాల పాటు గుర్తుండిపోవాలి అని కర్పత్రి మహారాజ్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





