– ఇద్దరు కార్మికుల మృతి
– క్షతగాత్రులు హైదరాబాద్కు తరలింపు
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కంపెనీలోని సి-బ్లాక్లో నైట్ షిప్ట్లో 18 మంది కార్మికులు విధులలో ఉన్నారు. రియాక్టర్ వద్ద పనులు జరుగుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి పెద్దవూర మండలానికి చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగన్నబోయిన నరేష్కుమార్ మృతిచెందారు. రియాక్టర్ సమీపంలో పనిచేస్తున్న మరో పదిమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రియాక్టర్ పేలిన శబ్దం భారీగా వినిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, ఎస్సై జగన్ పోలీసు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. చౌటుప్పల్, హయత్నగర్ నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. హెజో లేబొరేటరీస్లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత జూలై 16న రసాయన వాయువులు పీల్చడంతో అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉలికల్లు గ్రామానికి చెందిన ఆలుమూరు కృష్ణారెడ్డి (42) అనే కార్మికుడు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఆ ఘటన జరిగి నెల రోజులు కూడా పూర్తికాకముందే తాజాగా రియాక్టర్ పేలడంతో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం తర్వాత కంపెనీ పరిసరాల్లో దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. కంపెనీ ఆవరణలో మురుగునీరు చేరి ఉండటంతో పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ దుర్వాసన కారణంగా కొందరికి తలతిరగడం, వాంతులు వంటి ఇబ్బందులు ఎదురైనట్లు చెబుతున్నారు. కంపెనీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రియాక్టర్ పేలుడు, గతంలో కార్మికుడి మృతి ఘటనల నేపథ్యంలో కంపెనీలో భద్రతా ప్రమాణాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్