- కాంగ్రెస్ వొచ్చాక గతితప్పిన గ్రామ స్వరాజ్యం
- ఎక్స్ వేదికగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. గ్రామ స్వరాజ్యం కోసం జాతిపిత మహాత్ముడు కన్న కలల్ని కూడా సాకారం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా . పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న… మహాత్మా గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పాలనలో ప్రాణంపోసిన ‘పల్లెప్రగతి’ని గుర్తుచేసుకోవాలని ఎక్స్ వేదిక గా తెలిపారు. సమైక్య పాలనలో దశాబ్దాలపాటు దగాపడ్డ పల్లెలను.. దర్జాగా కాలర్ ఎగరేసుకునే స్థాయికి కేసీఆర్ తీర్చదిద్దారని తెలిపారు. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ప్రతి పల్లె నాడు సకల సౌకర్యాల హరివిల్లైంది. కేసీఆర్ సంకల్పంతో ప్రతి పల్లెసీమ ప్రగతిసీమగా మారిందని అన్నారు. నాడు పల్లెలో డంప్ యార్డు తప్ప.. చెత్త కంపు లేని పరిస్థితి. కూలిపోయే స్థితి ఉన్న ఖాలీ ఇండ్ల కిరికిరి నుంచి పొంగిపొర్లే మురికికాలువల శుభ్రత వరకూ ప్రతి సమస్యకు పదేళ్ల పాలనలో శాశ్వత పరిష్కారం లభించిందని వివరించారు.
కలుషిత నీటి కలకలం లేకుండా, సీజనల్ రోగాల చింతలేకుండా సాగిన పంచాయతీల ప్రస్థానం గ్రామస్వరాజ్యంలో ఓ స్వర్ణయుగమని అన్నారు. పచ్చదనానికి కొదవ లేకుండా, నిధులకు కొరత లేకుండా, విధులకు ఆటంకం లేకుండా, ప్రతి ఊరును మెరుగైన జీవనానికి మారుపేరుగా మార్చింది మన కేసీఆర్ విజన్ అని అన్నారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లెప్రగతిలో 30 శాతం అవార్డులను గెలుచుకోవడం పల్లె ప్రగతిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి విజయం. నాడు పదేళ్లపాటు మురిసిన పల్లె, కాంగ్రెస్ పాలనలో నేడు మళ్లీ కన్నీరు పెడుతోంది. కాంగ్రెస్ పాలనలో గ్రామ స్వరాజ్యం పూర్తిగా గాడి తప్పింది.
ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు. గ్రామాల్లో కనీస వసతులు లేవు. పల్లెప్రజలకు గుక్కెడు మంచినీళ్లు దిక్కు లేవు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు. ఉపాధి హామీ కూలీలకు పని దినాలు లేవు. మాజీ సర్పంచ్ ల బిల్లులకే మోక్షం లేదు. దేశంలోనే ఆదర్శ గ్రామాలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ పల్లెలు అధ్వాన పరిస్థితులకు అడ్రస్ గా మారడం అత్యంత బాధాకరం. దిల్లీ పార్టీలను నమ్మిన పాపానికి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన తీరును తెలంగాణ పల్లె ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి, పచ్చని పల్లెలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాతపెడ్తారని కేటీఆర్ అన్నారు.