- 78.57 శాతం పోలింగ్
- ఈనెల 25న వోట్ల లెక్కింపు
- రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతం వోట్లు పోల్ అయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం వోటర్లు 112 మందిలో 88 మంది వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 112 వోటర్లలో ఎక్స్ అఫిషియో మెంబర్ 31 కాగా, అందులో 22 మంది వోటు హక్కును వినియోగించుకున్నారు.
81 మంది కార్పొరేటర్ల లో 66 మంది వోటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 37.51 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 77.68 శాతం, మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది సాయంత్రం 4 గంటల వరకు 78.57 శాతం నమోదు అయ్యింది. ఎన్నికల పరిశీలకులు సురేంద్ర మోహన్ రిటర్నింగ్ అధికారితో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్ కు బందోబస్తుతో తీసుకువచ్చిన పిదప పరిశీలన చేసిన తర్వాత స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈనెల 25న ఉదయం 8గంటలకు వోట్ల లెక్కింపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్ లో నిర్వహించనున్నారు.