– నిజాయతీ, నిబద్దత, క్రమశిక్షణతో పనిచేయండి
– రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లు
– రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: నీళ్లు.. నిధులు.. నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-2 నియామకాలలో ఎంపికై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులైన 14మంది అధికారులు మంత్రి పొంగులేటిని సచివాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని మంత్రిగారు అభినందించి ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో నిరుద్యోగ యువత కన్నకలలు కల్లలైపోయాయని, ఉద్యోగాల నియామక ప్రక్రియలో చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయని విమర్శించారు. ఆనాటి ప్రభుత్వం చేపట్టిన అరకొర ఉద్యోగ నియామక ప్రక్రియలలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్ద పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్ధితి దాపురించిందన్నారు. ఈ పరిస్ధితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యమిచ్చిందన్నారు. అందువల్లే గత 20 నెలల పాలనా కాలంలో ఇప్పటివరకు 70 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగిందని వివరించారు. అంతేగాక నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఆలోచన మేరకు వివిధ శాఖల తరపున కార్యాచరణను విస్తృతం చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖలో జీపీవోల నియామకం, హౌసింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో దాదాపు 350 మంది ఇంజనీర్లు, సర్వే విభాగంలో 3465 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే అధికారులు సామాన్య ప్రజలే లక్ష్యంగా సేవలు అందించాలని, తద్వారా ఉద్యోగానికి న్యాయం చేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయతీ, నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ పేరు ప్రతిష్టలను ఇనుమడిరపజేయాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





