– సర్వేను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి
– రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వం ప్రాజెక్టును పక్కనబెట్టింది
– మన్నెవారిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు సర్వేను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రానికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారి పల్లికి చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఆ గ్రామం వద్ద ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ 30 టీఎంసీల తరలింపు, మూడు లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 1983లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరైందని, ఉమ్మడి రాష్ట్రంలో 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి టన్నెల్-1, టన్నెల్-2 పనులను ప్రారంభించి రూ.1968 కోట్లతో టెండర్లు ఇచ్చారని తెలిపారు. టన్నెల్ బోర్ మిషన్ను దేశంలోనే తొలిసారి ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఉపయోగించారని, 2014 వరకు కి.మీ టన్నెల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పదేళ్లలో పది కి.మీ కూడా కేసీఆర్ పూర్తిచేయలేదని, రాజకీయ దురుద్దేశంతో హరీష్, కేసీఆర్ ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారని ఆరోపించారు. గ్రావిటీ ద్వారా నల్గొండకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ప్రపంచంలో 40 కి.మీ టన్నెల్ ఎక్కడా లేదని, ఇది పూర్తయితే తెలంగాణకు ఆ రికార్డు దక్కుతుందని తెలిపారు. ఆనాడు రూ.2 వేల కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది ఇప్పుడు పెరిగిన అంచనాలతో రూ.4600 కోట్లతో ఈ టన్నెల్ను పూర్తి చేయాల్సి వస్తున్నదన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే కాదు.. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని కేసీఆర్పై మండిపడ్డారు. పదేళ్లలో రూ.లక్షా 86 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు.. అందులో రూ.లక్షా 5 వేల కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేశారు.. కృష్ణాలో మన వాటా మనం తీసుకోకపోవడం వల్ల ఆ నీటిని ఆంధ్రా తరలించుకుపోతోందని వివరించారు. 299 టీఎంసీలు చాలు అని ఆనాడు హరీష్ సంతకం పెట్టి వచ్చారు.. మన వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్లో దీనిపై మేం వాదనలు వినిపిస్తూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నాం అని వెల్లడిరచారు. ఇంత తక్కువ ఖర్చుతో 30 టీఎంసీలు తీసుకెళ్లే ప్రాజెక్టు ఎక్కడా లేదని, తాము అధికారంలోకి వచ్చాక పనులు మొదలు పెట్టగా దురదృష్టవశాత్తు ఎనిమిదిమంది కార్మికులు చనిపోయారని, దీనిపై మాకు బాధ ఉన్నా ఆ కుటుంబాలను ఆదుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్మీలో ఉన్న పరిచయాలతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలని, తప్పులు చేసి, అప్పులు చేసి దోపిడీ చేశారనే ప్రజలు మిమ్మల్ని పక్కనబెట్టారు.. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఇక్కడి ప్రజలు మమ్మల్ని క్షమించరు.. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తాం.. ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్య తండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుని డిసెంబర్ 31లోగా సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టును ఇంకెప్పుడూ పూర్తి చేసుకోలేం.. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగొంచుకుని ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం.. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోకపోతే నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలకు నష్టం కలుగుతుంది అని తెలిపారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే పరిశీలన .. జెండా ఊపి సిగ్నల్
అక్కడ హెలీ మాగ్నెటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్ను, అందులో ఉన్న అధునాతన పరికరాలను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు. అక్కడే ముఖ్యమంత్రి జెండా ఊపి సర్వే హెలికాప్టర్ టేకాఫ్కు సిగ్నల్ ఇఎవష్ట్రఎరు. మన్నెవారిపల్లె సమీపంలో ఎస్ఎల్బీసీ అవుట్లెట్ వైపు నుంచి ఈ సర్వే ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్న హెలికాప్టర్ కూడా సర్వే హెలికాప్టర్తోపాటు బయల్దేరి సమాంతరంగా కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏరియల్ వ్యూ నుంచే సర్వే చేస్తున్న విధానాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్ మాగ్నెటిక్ సర్వే జరుగుతున్నది. హెలికాప్టర్కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్మీటర్తో ఈ సర్వే చేపడతారు. భూమిలో వెయ్యి మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటాను సేకరిస్తారు. భూమి లోపల ఉండే షీర్ జోన్లు, నీటి ప్రవాహాలు గుర్తించేందుకు ఇది హైటెక్ సర్వే పద్ధతి అని అధికారులు ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





