– గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా
– 19మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– 14మందికి గంజాయి పాజిటివ్గా గుర్తింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: గంజాయి, డ్రగ్స్ వినియోగంపై భారీగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ కమిషనరేట్ల పరిధిలో ఈగల్ ఫోర్స్ పలు ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 19 మందిని అదుపులోకి తీసుకుంది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా 14మందికి గంజాయి పాజిటివ్, మరో వ్యక్తికి గంజాయితోపాటు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పట్టుబడిన వారందరూ డ్రగ్స్ వినియోగించినట్లు విచారణలో అంగీకరించారని ఈగల్ ఫోర్స్ వెల్లడించింది. వీరిని డీ అడిక్షన్ సెంటర్లకు తరలించామని, వీరి తల్లిదండ్రులకు సమాచారం అందించామని తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతోపాటు మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈగల్ ఫోర్స్ ఈ దాడులు చేసింది. 15 బృందాలను ఏర్పాటు చేసి వారి సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. విచారణలో గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వారి నుంచి ఈగల్ ఫోర్స్ పలు కీలక విషయాలు రాబట్టింది. గోవాలోని వగటోర్ బీచ్ ప్రాంతాన్ని ఒక ముఠా కేంద్రంగా సుకుని కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. వాటిని బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్కు రవాణా చేస్తున్నట్లు కనుక్కొంది. సినీ పరిశ్రమలోని పలువురికి వీటిని విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సాంకేతిక విశ్లేషణ ద్వారా మొత్తం 44 మంది వినియోగదారులను ఈగల్ ఫోర్స్ గుర్తించింది. డ్రగ్స్ వినియోగదారులు హైదరాబాద్, ఆంధప్రదేశ్, కర్ణాటకతోపాటు గోవాలో ఉన్నట్లు విచారణలో బహిర్గతమైందని ఈగల్ టీం తెలిపింది. డ్రగ్స్ కొనుగోలు కోసం వినియోగదారులు చక్రపాణి, హర్షిత్ రెడ్డిల ఖాతాలకు రూ.3.13 లక్షలకుపైగా నగదు బదిలీ అయినట్లు గుర్తించింది. 2019లో వీరిద్దరు ఎన్డీపీఎస్ కేసులో అరెస్టయినట్లు ఈగల్ టీం వెల్లడించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.