– కేంద్రం అసమర్థతకు ‘నీట్’ కుంభకోణమే నిదర్శనం
– జీళ్లచెరువు క్లస్టర్ ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి
కూసుమంచి, ప్రజాతంత్ర, మే 13 : ‘కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన అసమర్థతతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి చేయడం కాదు.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల గొంతు కోయడమేనా’ అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘నీట్’ ప్రశ్న పత్రాల లీకేజీపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పరీక్షకు 42 గంటల ముందు పేపర్లు బయటకు రావడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది మన రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థులు ఈ కుంభకోణం వల్ల రోడ్డున పడ్డారని అవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మాత్రం ఏమీ ఎరుగనట్లు నాటకమాడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నాడు దొరల పాలనలోనూ..
తెలంగాణలో గత పదేళ్ల దొరల పాలనలో జరిగిన అన్యాయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు అన్ని పేపర్లూ లీక్ అయ్యాయన్నారు. ఆనాటి మంత్రుల పీఏలే జిరాక్స్ సెంటర్లలో పేపర్లు అమ్మారని ఆరోపించారు. ఆనాడు ఇంటర్ ఫలితాల తారుమారు వల్ల 28 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే నియామక సంస్థలను ప్రక్షాళన చేసి పారదర్శకంగా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
ప్రజా దర్బార్లో అర్జీల వెల్లువ
జీళ్ళచెరువు క్లస్టర్ పరిధిలోని 13 గ్రామ పంచాయతీల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి మంత్రి పొంగులేటి జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూ సమస్యలపై వచ్చిన వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. న్యాయమైన ప్రతి సమస్యను వంద శాతం పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





