– ముమ్మరంగా సీబీఐ దర్యాప్తు
ముంబయి, మే 22: ‘నీట్’ గెస్ పేపర్ను కొనుగోలు చేసిన ఒక డాక్టర్ను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఆయన హాస్పిటల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి గెస్ పేపర్ లీక్ చేయడంపై ప్రశ్నిస్తున్నది. మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ మనోజ్ శిరూరేకు ఇప్పటికే అరెస్టయిన ఎన్టీఏ కమిటీలో సభ్యుడైన పూణెకు చెందిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణి, ఆర్సీసీ క్లాసెస్ డైరెక్టర్ శివరాజ్ మోటెగావ్కర్తో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో తన మేనల్లుడు, మేనకోడలు కోసం గెస్ పేపర్ను ఆయన కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో డాక్టర్ మనోజ్ను సీబీఐ అధికారులు గురువారం లాతూర్లో అదుపులోకి తీసుకున్నారు. పూణెలోని తమ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత దిల్లీకి తీసుకెళ్లి ఆయన అరెస్టును ప్రకటించనున్నారు. కాగా, నీట్ పరీక్షకు కొన్ని రోజుల ముందు డాక్టర్ మనోజ్కు చెందిన లాతూర్లోని హాస్పిటల్లో పీవీ కులకర్ణి ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. ఆర్సీసీ క్లాసెస్ డైరెక్టర్ శివరాజ్ కుమారుడు కూడా ఈ తరగతులకు హాజరైనట్లు పేర్కొంది. ఈ హాస్పిటల్లోనే గెస్ పేర్ లీకైనట్లు సీబీఐ నిర్దారించింది. ఈ నేపథ్యంలో శివరాజ్ కుమారుడు, డాక్టర్ మనోజ్ మేనకోడలు, మేనల్లుడిని కూడా అధికారులు విడివిడిగా ప్రశ్నించారు. మరోవైపు పరీక్షకు ముందు కుమార్తె కోసం లీకైన ప్రశ్నాపత్రాన్ని రూ.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు భావురావు కదమ్పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నాందేడ్లోని ఆయన నివాసంపై సీబీఐ దాడి చేసింది. సుమారు ఎనిమిది గంటలపాటు జరిగిన సోదాల్లో కీలక పత్రాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. భావురావు కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. తదుపరి విచారణ కోసం పుణెలోని తమ కార్యాలయానికి రావాలని భావురావు, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



