వీళ్ళ నాలికలు చాలా పొడవు!? 

డైవర్టేషన్ పాలిటిక్స్ చేయడం కూడా కనాకష్టంగా ఉన్న నేటి పరిస్థితుల్లో సోయి,సొరంపులేని మాటలతో స్థాయిని మరిచి పాలకులు ప్రజల్ని మభ్య పెడుతున్నారు.ఒక్కోసారి మాట్లాడేది వారేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది.
ఈమాటల మాటున దాగిన మర్మమేమి?అమాత్యా! 
రాచరిక వ్యవస్థ లో ప్రభువుల నోట ఏమాట వస్తుందో ఆమాటేశాసనం. ఆమాటేచెల్లుబడి. అది ఎవరికి మోదమో? ఎవరికి ఖేదమో?అర్థం కాని అయోమయం కూడా ఉండేది. ఆధునిక రాజరికాలు వెలగబెడుతున్న నేటి పాలకులు కూడా అచ్చం అదే ధోరణితో సోయి లేని మాటలకు సొబగులు అద్ది కాలం వెల్లబుచ్చుతున్నారు. చెప్పేవాడికి వినేవాడు లోకువలా పాలకుల పరిస్థితి ప్రస్తుతం ఉంది. పలురకాల వాగ్దానాలు చేసి నానారకాల గడ్డి కరిచి అధికారం లోనికి వచ్చిన పాలకులకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రజల్ని సంతృప్తి పరిచేలా లేదు? ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం బొట్టు అన్న సామెతను గుర్తు చేసేదిగా ఉంది.రూపాయివిలువ దిగజారుతుంది.ధరలు ఆకాశందాటి పెరిగి పోతున్నాయి.ఇట్లాంటి స్థితిలో పాలకుల మాటలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి.
   డైవర్టేషన్ పాలిటిక్స్ చేయడం కూడా కనాకష్టంగా ఉన్న నేటి పరిస్థితుల్లో సోయి,సొరంపులేని మాటలతో స్థాయిని మరిచి పాలకులు ప్రజల్ని మభ్య పెడుతున్నారు.ఒక్కోసారి మాట్లాడేది వారేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది.ఇందులో అందరికంటే ఓఅడుగు ముందు 40ఏళ్ళ రాజకీయ ఇండస్ట్రీ నడిపిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు.ఆయన ఏకంగా జనాభా తగ్గిపోతుంది.కేంద్రంనుంచి వచ్చే వాటా తగ్గిపోతుంది.రేపు మందుకో,మాకుకో,లేక నాలుగు పచ్చ నోట్లు చేతిలో పెడితేనో వోటు వేసే వోటర్ల  సంఖ్య పడిపోతుంది.రేపు మాకొలువుకూటముల్లోపనిచేసే బానిసలసంఖ్య అదే క్రమంలో తగ్గుతుంది.అదేజరిగితే, మామనుగఢ ప్రశ్నార్థకం అవుతుంది.మా పిల్ల జెల్ల తరాల ఏలుబడి పీఠాలు ఎలా? కనుక అందుకోసరికొత్త పధకం ఆలోచించారు.ఒకప్పుడు ఇద్దరు చాలు ఒక్కరు ముద్దు!అన్న ఆయనే ఇప్పుడు ఇంటికో నలుగురో,ఐదుగురిలో పిల్లల్ని కనండి.ఎంచక్కగా ముగ్గుర్ని కంటే ముప్పై వేలు,నలుగుర్ని కంటే నలబై వేలు ప్రకటించేశారు.ఇంకా ప్రకటించలేదు కానిఅంతకు మించి కన్నప్పటికీ, పిల్లకు పదివేలు అదనంగా ఇన్సెంటివ్ ఇస్తానన్న ఆశ్చర్యం లేదు.వేలకోట్ల ఆస్తీ ఉన్న ఆయనకోలోకేశం,మళ్ళీ ఆయనకో దేవాంశం! ఇది సీనియర్ ఆదర్శ పాలకుడు తనదు మాలిని ధర్మం తో బోధిస్తున్న ధర్మ సూక్ష్మం!అంతేకాదు ఈపూటతింటే మరుపూటకులేని పేదలకి స్తున్న సందేశం పరిమితి కి మించి పిల్లల్ని కనండి,మీ చావు మీరు చావండి.
   ఈసందేశం అరడజనో,డజనో పిల్లల్ని కన్న స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి పాలకులు చెబితే ప్రజలు కాస్తో,కూస్తోవినసొంపుగా ఉండేది, కాస్తా నైతికత అనిపించేది. కానీ, విద్యలో, పాలనలో ప్రైవేటు భాగస్వామ్యం వెతుకుతున్న చంద్రబాబు నాయుడు ప్రజలు పిల్లల్ని కనడం ద్వారా జనాభా లెక్కలే స్తున్నారు. కానీ ,రేపు ఎదురయ్యేజీవన ఇబ్బందులు స్ఫురద్రూపం కానట్టు న్నాయి…కనీసం కొత్తగా పుట్టిన పిల్లలకు అన్న క్యాంటిన్లు విస్తరించి ఐదు రూపాయలు భోజనం అదనంగా పెడతామన్న భరోసా కూడా ఆయన నూతనంగాపిల్లలుకనబోయోదంపతులకు భరోసా మాత్రం ఎక్కడా ఇచ్చినట్లుకూడా లేదు.తిరపతిలడ్డు,సనాతనధర్మం తర్వాత చంద్రబాబు ఈపధకమే డైవర్టేషన్ పర్వార్శన్ లో అగ్రభాగాన నిలిచింది.కనడం ద్వారా ఇన్స్టెట్ మనీ వస్తుంది.”ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చినట్లు”ఆతర్వాత ప్రజల కర్మ?పిల్లల్ని కనేలోపు ఆపధకం అమలు బాద్యత ఆయన చేకూర్చే అవకాశం ఎలాగూ లేదు?కొన్నాళ్లుగా ఇచ్చేది.ఏలోకేష్,దేవాన్ష్ నో అధికారం లోకి వచ్చి నెరవేర్చు తారనే ఆయనలోదాగిన సుదీర్ఘ ఆశ కావచ్చును.ఏదిఎలాఉన్నా “అరడజను లేక డజను పిల్లల కల”చంద్రబాబుమదినుండి దూసుకొచ్చిన స్ఫురద్రౄప మానసపదకమే కావచ్చు నేమో!?
    ఇకపోతే రెండో జలక్ మన ప్రదాని నరేంద్ర మోదీ ఇచ్చారు.బెంగాల్ ఎన్నికల తర్వాత ఉత్సాహం ఉరకలెత్తి,ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఇచ్చిన దక్షిణాది రాష్ట్రం తెలంగాణాకు హుటాహుటినపరుగెత్తు కొచ్చారు.ఆయనకూడా పాలనాపరంగా పెద్ద ఇండస్ట్రీనే.ఏమైందో ఏమో! కనీస నైతికత మరచారు.అవకాశవాదానికి అవధులు లేవని నిరూపించారు.బహిరంగ సభలోనే తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ ఆఫర్ ఇచ్చారు.తమతో కలిసి వస్తే ఇంకా పెద్ద స్థానం లో కూర్చోబెట్టాడతానన్నారు.ముఖ్యమంత్రి తర్వాత ఇంకా పెద్ద పీఠం ఏముంటుంది ప్రధాని పీఠమేకదా? రేవంత్ రెడ్డి ఉబ్బితబ్బిబ్బు అయి ఏమనలేక,ఏడ్వలేక,నవ్వలేక నవ్వారు?కానీ, మోదీ మాటల వెనుక మర్మం చాలా ప్రభావవంతమైనది.మోదీ,ఆమాట రేవంత్ రెడ్డి తోలోపల ఉన్న అనుబంధం తోనైనా మనస్ఫూర్తిగానే అడిగి ఉండవచ్చును.లేదా బయట మాటగా ప్రత్యార్థి శిబిరంలో ఉన్న ముఖ్యమంత్రి విశ్త్వాసనీయతను దెబ్బతీసే ఎత్తుగడగా నైనా వాడి ఉండవచ్చును.కానీ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం లో తెలంగాణ లో ఓమందుపాతర లాంటి అనుమానం దట్టించి ప్రధాని వెళ్ళిపోయారు.
    ఇక ఇదే విషయంలో ఏమైందో ఏమో కానీ,నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మరో అడుగు ముందుకు వేసి రేవంత్ రెడ్డి పశ్చిమ బెంగాల్ లో మాదిరిగా రేవంత్ మరో సువేందు అధికారి అవుతారేమో? మోదీ తో అంత అనుబంధం కలిగి ఉన్నారేమో?ననే అనుమానాలు బహిరంగంగా వ్యక్తం చేశారు.ఈయనపై స్పందించిన నాగర్ కర్నూల్ యంపి మల్లు రవి మాట్లాడుతూ బండిబగీరద్ విషయం లో మానవతా దృక్పథంతో చూడాలి . ఎవరికి సమస్య వచ్చినా అదే దృష్టి తో సహకరించాలని అంటున్నారు.మరినల్గురు బలహీన వర్గాల పిల్లలను ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు ఈయనకు మానవతాదృక్పధం గుర్తు రాకపోవడం విశేషం.
    ఇంతటితో ప్రధాని మోదీ పెట్టిన మాటలు చిచ్చు ఆగుతుంది అనుకోవడంలేదు.రాజకీయంగా దాని లోతెంతా అనేది ఇప్పుడే కొలవలేము. కొలమానాలు పర్యావసానాలే!ఇక పోతే మరో చిత్రం అయిన విషయం ఏమంటే!మరో బిజెపి పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ .ఆయన తెలంగాణాలో ప్రత్యేక మైన విమర్శలు,మాటలు శైలి ద్వారా దిగువ నుంచి ఎగువ లోకి వచ్చిన రాజకీయ నేత.అడ్డంగా నాలిక మడిచి ఎంతటి విమర్శ నైనా చక్కని శిల్పంగా యతిప్రాసలతో చెక్కి ఎదుటివారిని స్వేచ్చ గా మాటలదాడిచేసిన మాంత్రికుడు.ఆడుకున్నవాడు.తాజా సన్ స్ట్రోక్ తో మైండ్ సెట్టు మార్చుకున్నట్లున్నారు.తన స్వభావం తనకు తానే బయట పెట్టుకున్నారు.తనకుమారుడి వ్యవహారం లో తనపేరుతేవద్దని ఏకంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.ఏదైనా తనదాకా వస్తేగాని మాటల పవరేంటో ఆయనకు అర్థంకాలేదు.అవలీలగా విమర్శనాస్త్రాలు సంధించిన ఆయన తనగురించి మాట్లాడవద్దు అని పత్రికా స్వేచ్ఛ ను,పౌరులవాక్ స్వాతంత్రాన్ని ప్రశ్నార్థకం చేయడం విచిత్రంగా ఉంది.న్యాయస్థానం కూడా ఈవిషయం లో ఎలా ఉత్తర్వులు ఇచ్చింది అంతుబట్టని వింత గానే ఉంది.సామాన్యులకొక చట్టం,మంత్రివర్యులకుమరో చట్టం ఎలా ఉంటుంది? మరి ఆయనే చెప్పాలసి ఉంది.
    నాలిక విప్పేటప్పుడు ఎదుటి వాళ్ళకు నాలుక ఉంటుంది అనిగుర్తించని అధికార అహం అమాత్యుల చుట్టూవైపైలా చుట్టుకొని ఉంటుందేమో! ఇకపోతే,విమర్శలకు బూతులనో,పరుష పదజాలమో,అద్దక పోతే జనం రిసీవ్ చేసుకోలేరను కుంటున్నారో, ఏమో!కానీ,ఇటీవల వరంగల్ రైతు సభలో కేటీఆర్ మాట్లాడిన తీరు అంత హుందాగా లేదు?చేసిన విమర్శలో సహేతుకత ఉన్నా, ముఖ్యమంత్రి పై ఆయన పలికిన నాలిక అడ్డం వేసి మాట్లాడిన మాటలకు వందిమాగాదుల చప్పట్లు మోగవచ్చునేమో!కానీ ప్రజల్లో ఆయన నాయకత్వ స్థాయి పలచన అయింది.అంతేకాదు,ఆయన ఉపన్యాస శైలి సమస్య తీవ్రతను దెబ్బతీసింది.ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు వలన వస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీ మైలేజినికూడా పలుచన చేసింది.ఇట్లాంటి సున్నిత, సునిశిత విషయాలేనాయకులను మరుగున పరుస్తాయి.అన్న విషయం రాజకీయ నేతలు ఎవరైనా గుర్తించాల్సిన అంశం.కాలంచెల్లిన మాటలు, ఊకదంపుడు ప్రజలు అర్థం చేసుకునే చైతన్య స్థితికి చేరుకుంటున్నారు.
     ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడినా,సహనం కోల్పోయి మాట్లాడినా పాలకులు మాటల్లో అర్థం,ఆంతర్యం ప్రజలు గమనిస్తున్న పరిస్థితి ఉంది.కనుక పాలకులారా!తమకు అధికారం ఉంది.కనుక నాలుక ఎంతదూరం అయినాచాపగలం అనుకుంటే పొరపాటు పడ్డట్లే! ఏ మాటల మాటున ఏఆంతర్యం దాగి ఉందో అర్థంకాని అమాయకులు కారు ప్రజలు.ప్రజలారా! రాజకీయ నాయకుల నాలికలు చాలా పొడవు!బహుపరాక్, బహుపరాక్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *