అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలికను క్షమించా

– కేసులతో వేధించమని ప్రధాని హామీ
– కేసును వెనక్కి తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు

న్యూదిల్లీ, ఆగస్ట్ 3: ‌నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ఆం‌దోళనల్లో భాగంగా ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్‌ ‌బాలికపై కేసును కొనసాగించబోమని దిల్లీ పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసి దిల్లీలోని పార్లమెంట్‌ ‌స్ట్రీట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రధాని పదవిని అగౌరవపర్చేలా, శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. అయితే, ప్రస్తుతం ఆ కేసును బాలికపై కొనసాగించడం లేదని పోలీసులు వెల్లడించారు. తన కుమార్తెపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు వయసు 25 ఏళ్లుగా నమోదు చేశారని. కానీ ఆమె వయసు 15 ఏళ్లే అని తన తల్లి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  ఈ క్రమంలోనే బాలిక తల్లి తప్పు తెలుసుకుని ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తన కుమార్తెను క్షమించి గొప్ప మనసు చాటుకున్నారని ఆమె ప్రధానిని కొనియాడారు. 18 ఏళ్లలోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్‌, ‌ఫేస్‌బుక్‌ ‌వంటి సామాజిక మాధ్యమాలను నిషేధించాలని ఆమె సూచించారు. చిన్నారులకు తెలియక సులభంగా ఇతరుల ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. వారి దృష్టి చదువులపైనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  జంతర్‌మంతర్‌ ‌నిరసనల సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి అసభ్యపదజాలంతో మాట్లాడిన బాలికపై కేసు పెట్టవద్దని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కూడా  కథనాలు వెలువడ్డాయి. ఈ ఉదంతానికి సంబంధించి తొలుత నోయిడా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌ఫైల్‌ ‌చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఢిల్లీ పోలీసులు ఈ ఉదంతంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బాలిక ప్రధానికి క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్‌ ‌చేసింది. తనకు 15 ఏళ్లేనని, నిరసన వద్ద ఇతరుల ప్రభావానికి లోనై అలాంటి వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చుకుంది. ఇది తన చివరి తప్పిదమని కూడా చెప్పింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా సోషల్ ‌మీడియా వేదికగా స్పందించారు. తప్పుదారి పట్టిన పిల్లలను క్షమించాలని అభిప్రాయపడ్డారు. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు. బాలిక తల్లి కూడా ఈ ఉదంతంపై స్పందించారు. తన కుమార్తెను క్షమించిన ప్రధాని ఆమెకు జీవనదానం చేశారని అన్నారు. బాలికపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. సోషల్‌ ‌డియా వాడకుండా మైనర్లపై నిషేధం ఉండాలని కూడా అభిప్రాయపడ్డారు. అయితే  తన కుమార్తెను ప్రధాని క్షమించినా పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్‌ను వెనక్కు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక చేసిన తప్పునకు పశ్చాత్తాపడుతోందని చెప్పారు. తప్పుదారి పట్టిన చిన్నారులను క్షమించాలని, సక్రమమార్గంలో నడిపించాలని ప్రధాని చెప్పినా పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్‌ ‌వెనక్కు తీసుకోలేదని అన్నారు. పెద్దల విషయంలో తన కూతురు అసభ్య పదజాలం వాడి ఉండాల్సింది కాదని అన్నారు. నిరసన తెలిపేందుకు, వివిధ వేదికల్లో తమ అభిప్రాయాలను వినిపించేందుకు యువతకు హక్కు ఉన్నప్పటికీ అసభ్య భాష మాత్రం వాడకూడదని బాలిక తల్లి అభిప్రాయపడ్డారు. పుట్టిన రోజుకోసం దుస్తులు కొనుక్కుంటానని జులై 23న తన కుమార్తె బయటకు వెళ్లిందని చెప్పారు. ఆమె వైరల్‌ ‌వీడియోను బంధువులు పంపించాకే ఈ విషయం తమకు తెలిసిందని చెప్పారు. ’ఘటన గురించి వెలుగులోకి వచ్చాక మేము ముఖం దాచుకుని బయటకు వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఉన్న ప్రాంతం నుంచి మేము మరో చోటకు మారిపోయాము. తరచూ మకాం మార్చాల్సి వస్తోంది. బాలిక మైనర్‌ అని ఇప్పటికే నిర్దారణ అయ్యింది. కానీ ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ ‌మాత్రం ఇంకా వెనక్కు తీసుకోలేదు’ అని బాలిక తల్లి తెలిపారు. బాలిక కూడా క్షమాపణ చెప్పిన విషయాన్ని పేర్కొన్నారు. ’ప్రధాని స్వయంగా ఆమెను క్షమించినప్పుడు పోలీసులు కూడా కేసు క్లోజ్‌ ‌చేసి ఎఫ్‌ఐఆర్‌ను వెనక్కు తీసుకోవాలి’ అని అభ్యర్థించారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *