- నిరాహార దీక్షకు దిగిన విద్యార్థులు.. ఆందోళన
– ఆందోళనకు సీజేపీ నేత అభిజిత్ దీప్కే మద్దతు
రాంచీ, ఆగస్టు 3: నీట్ పేపర్ లీక్ నిరసనలతో కొన్నిరోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారగా ఇప్పుడు ఝార్ఖండ్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు చోటుచేసుకున్నాయని రాజధాని నగరం రాంచీలో ప్రారంభమైన ఆందోళనలు ఉధృతంగా మారాయి. నియామక పరీక్షను రద్దు చేయాలని, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, సంస్కరణలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఆదివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. ‘జేపీఎస్సీ పరీక్ష ఫలితాలు గత నెల విడుదలయ్యాయి.. తర్వాత ముఖ్యమంత్రిని కలిసి పేపర్ లీక్పై ఆధారాలను సమర్పించాం.. కొన్ని వారాలుగా నిరసనలు జరుగుతున్నా విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం, జేపీఎస్సీ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనాయి.. దాంతో విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు.. వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు, మా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాను.. నిందితులకు శిక్ష పడటమే మా ప్రధాన లక్ష్యం’ అని ఆందోళనకారులను ఉద్దేశించి మహతో మాట్లాడారు. పేపర్ లీక్ ఆరోపణలు, నియామక పక్రియలో అవకతవకలు, పాలనాపరమైన లోపాలతో తమ కెరీర్కు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ రాష్ట్రంలోని విద్యార్థులు కొన్ని వారాల క్రితం నిరసనలు ప్రారంభించారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలకు సంబంధించి ఓఎంఆర్ షీట్ వైరల్ అయిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని ఆందోళనకారులు విమర్శించారు. ఈ పరీక్షల విషయంలో సంస్థాగత మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిరసనకారులతో మాట్లాడాం.. వారి డిమాండ్లకు మా మద్దతు ఉంటుందని అభిజీత్ దీప్కే ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. రాంచీలో ప్రస్తుతం విద్యార్థుల నిరసనలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తమ డిమాండ్స్కు ఆమోదం తెలిపే వరకూ తన దీక్ష కొనసాగుతుందని మహతో చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో టీడీపీఎల్ ద్వారా జరిగిన పరీక్షలను సమిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలికను క్షమించా