తెలంగాణను దేశం అనుసరిస్తోంది

ఈ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చట అని నవ్వారు
తలెత్తుకుని నిలబడేలా పాలన చేస్తున్నాం
సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: రాష్ట్రంలో తమకు తిరుగులేదని అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టి మూడు రంగుల జెండా ఎగరేశాం.. ఈ ఎల్‌బీ స్టేడియంలోనే ప్రజా పాలనకు నాంది పలికాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చట అని, సంక్షేమ పథకాలు అమలు చేయదని, కలిసి ఉండరని చాలామంది ప్రచారం చేశారు.. కానీ నవ్విన వాళ్ల ముందు తలెత్తుకుని నిలబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాం అని చెప్పారు. ‘తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా తీర్చిదిద్దామన్నారు. కులగణనను పూర్తి చేసి బీసీల లెక్క తేల్చాం.. చితికిన ఆర్ధిక వ్యవస్థ ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాం.. 18 నెలల్లో రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్‌, పేదలకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం.. వరి వేస్తే ఉరే అని నాటి ప్రభుత్వం చెప్తే వరి వేయండి సన్న వడ్లకు బోనస్‌ ఇస్తాం అని మేం చెప్పాం.. దేశంలోనే అత్యధిక వరి పండిరచి తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలబెట్టాం’ అని వివరించారు. రైతు భరోసా వేయొద్దని గోతికాడి నక్కలా ఎదురు చూశారు.. కానీ తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని చెప్పారు. ఈ వేదికగా సవాల్‌ విసురుతున్నా.. మోదీ వస్తాడో, కిషన్‌ రెడ్డి వస్తాడో, కెసీఆర్‌ వస్తాడో రండి.. రైతులకు మేలు చేసింది ఎవరో అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని పిలుపునిచ్చారు. పజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని చెప్పారు.

ఆడబిడ్డలకు ఆదాయం కల్పిస్తున్నాం

పేదలకు రూ.5 భోజనం పెట్టే కార్యక్రమానికి ఇందిరమ్మ పేరు పెడితే కొందరు సన్నాసులు విమర్శలు చేస్తున్నారు.. పేదల సంక్షేమం అంటేనే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటేనే పేదల సంక్షేమం.. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు అందించి లాభాలు గడిరచేలా ప్రోత్సహిస్తాం అని చెప్పారు. మహిళా సంఘాలకు పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాం.. ఆత్మగౌరవంతో బతికేలా చర్యలు తీసుకున్నాం అని రేవంత్‌రెడ్డి చెప్పారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ఈ వేదికగా మహిళలకు పిలుపునిస్తున్నా.. స్వయం సహాయక సంఘాలలో చేరండి.. ఆర్థికంగా నిలబడండి.. కిషన్‌ రెడ్డి, కెసీఆర్‌లకు సవాల్‌ విసురుతున్నా.. లెక్క ఒక్కటి తగ్గినా క్షమాపణ చెబుతానన్నారు. 18 నెలల్లో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. వంద నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని, ప్రపంచంతో పోటీపడేలా మన విద్యా ప్రమాణాలు ఉండాలని ప్రణాళికలు వేసుకున్నామని చెప్పారు. యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, వచ్చే ఒలింపిక్స్‌ లక్ష్యంగా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసి 2030 ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించేలా యువతను తీర్చిదిద్దుతామని తెలిపారు. పార్టీ కార్యకర్తలే తమ బ్రాండ్‌ అంబాసిడర్లు.. సోషల్‌ మీడియాలో యుద్ధం ప్రకటించండి.. ఈ యుద్ధంలో కల్వకుంట్ల కుటుంబం ఓడిపోవాలి అని పేర్కొన్నారు. వచ్చేవి కార్యకర్తల ఎన్నికలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాంటూ కార్యకర్తలకు నూరు శాతం న్యాయం చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 150కి పెరగబోతోంది.. మహిళా రిజర్వేషన్‌ రాబోతోంది.. 60మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు.. మీరు ఢల్లీికి వెళ్లాల్సిన అవసరం లేదు.. మీ టికెట్‌ మీ ఇంటికే వస్తుంది.. వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ సీట్లు, 15 ఎంపీలు గెలిపిస్తాం రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page