– ‘సర్ ‘ ప్రక్రియతో లక్షలాదిమంది ఓట్లు గల్లంతు
– రాజకీయ వేధింపులకు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
– ‘ఇండి’ కూటమి భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
న్యూదిల్లీ, జూన్ 8: ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో దేశం సమస్యల్లో పడిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ హయాంలో రాజ్యాంగంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండి బ్లాక్ కూటమి పార్టీల నేతలు సోమవారం సమావేశమయ్యారు. మోదీ ప్రభుత్వంలో దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలను ఉద్దేశించి మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులు దేశానికి రావడం లేదన్నారు. పలు రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాలు పెరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తో లక్షలాదిమంది ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎమ్ఈ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. మోదీ ప్రభుత్వంలో పరీక్షల నిర్వహణ వైఫల్యాలతో యువత నష్టపోతున్నారని ఖర్గే చెప్పుకొచ్చారు. మూడేళ్ల క్రితం ఇండియా కూటమి ఏర్పడిందని, పార్లమెంటులో ఇటీవల దాని బలం ఏంటో అధికార పక్షం రుచి చూసిందన్నారు. లోక్సభలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లును ఓడించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 17న కూటమి పార్టీలు దృఢంగా ఏకమయ్యాయని ఖర్గే ప్రశంసించారు. ఇప్పుడు ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిపక్షం ఐక్యంగా ఉండాలన్నారు. కీలక సమావేశానికి 23 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. వారిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, దీపాంకర్ భట్టాచార్య, మెహబూబా ముఫ్తీ, సుప్రియా సూలే, బ్రివన్ థోల్ తదితరులు ఉన్నారు. అయితే, కీలక భాగస్వాములైన డీఎంకే, ఆప్ లు సమావేశానికి దూరంగా ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





