– నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమే
– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలు నిర్లక్ష్యానికి గురయ్యారు
– కాంగ్రెస్ పాలనలో కోటి 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు మంజూరు
– ఒక్క ఈ నియోజకవర్గంలోనే 40 వేల కార్డుల మంజూరు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీదేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు హస్తం వైపు వెలువడడమే ఇందుకు తార్కాణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకేనని తేల్చిచెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి గురువారం ఉదయం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కటంటే ఒక్క తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయలేదన్నారు. కేవలం 20 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు 89 లక్షల నుండి కోటి 15 లక్షలకు తెల్ల రేషన్ కార్డులు పెంచామన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఒక్క ఈ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకే 40 వేల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నిరుపేదలందరికి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్ర జనాభాలోని 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు సన్న బియ్యం అందించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలలో రోజురోజుకూ విశ్వసనీయత పెరుగుతోందని చెప్పారు. నాణ్యమైన సన్న బియ్యంతో 3.15 కోట్ల మంది లబ్ది పొందుతుండగా మహాలక్ష్మి పధకం కింద మహిళలు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయోజనం పొందుతున్నారన్నారు. అంతేగాక గృహ జ్యోతి పధకంతో అర్హులైన నిరుపేదలకు 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సంక్షేమ పధకాలను విస్మరించిన విపక్షాలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పాల్పడడం విడ్డురంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం కుదిరిందని, ఆ నమ్మకంతోటే ఇక్కడి ప్రజలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉప ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల కుట్రలను ఛేదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్కు ఎన్ని నిధులు విడుదల చేశారని సూటిగా ప్రశ్నించారు. ప్రచారంలో షాద్నగర్ ఎమ్మెల్యే ఇదూలపల్లి శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ నేత అజహంరుద్దీన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎస్.టి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఏ.ఐ.సి.సి కార్యదర్శి సంపత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ముదిరాజ్, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





