- బిజెపి స్కూల్లో శిక్షణ పొందిన రేవంత్
- బిఆర్ఎస్ హయాంలోనే వారికి మేలు జరిగింది
– మేమూ కొన్ని పొరపాట్లు చేసినా.. మేలు చేశాం
– కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్27: రాష్ట్రంలో మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మైనార్టీల కోసం రూ.4 వేల కోట్ల బ్జడెట్ పెడతామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. తాము కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేసి ఉంటే చేసుండొచ్చు కానీ.. ఇండియాలో మైనార్టీలకు కేసీఆర్ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదని కొనియాడారు. హైదరాబాద్లోని శంషాబాద్లో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మైనారిటీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాల్లో అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారు.. కానీ ఇక్కడ చెప్పరని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని.. ఇది కాంగ్రెస్-బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ లేరని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనైనా ఒక్క మైనార్టీ లీడర్ను కూడా ఎన్నుకోలేదని దుయ్యబట్టారు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్ లాంటి వారు కూడా కాంగ్రెస్కు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఇచ్చినట్లే ఇచ్చి అజారుద్దీన్ను పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో అజారుద్దీన్ కట్ షాట్లు కొడితే.. ఇక్కడ అజారుద్దీన్నే రేవంత్ రెడ్డి కట్ చేసేశారని ఫైర్ అయ్యారు. బుల్డోజర్ రాజ్యం నడవదని యూపీపై రాహుల్ గాంధీ విమర్శించారని.. ఇక్కడ అదే బుల్డోజర్ రాజ్యం నడుస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బంధువుకు కేంద్రంలో కాంట్రాక్టులు వస్తాయని.. బదులుగా రేవంత్ రెడ్డి కూడా బీజేపీ నేతలకు లాభం చేకూరుస్తారని ఆరోపించారు. మోదీ తెచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తొందరగా ఇక్కడ రేవంత్ అమలు చేస్తారని విమర్శించారు. ఇది బడే భాయ్ కోసం రేవంత్ రెడ్డి చేసిన పని అంటూ ఎద్దేవా చేశారు. మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి పురుషులకు టికెట్ రేట్ డబుల్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ మాట తప్పిందని.. రెండేళ్లు అయిపోయాయి.. ఇంకో మూడేళ్లలో కూడా వీళ్లు చేసేది ఏ ఉండదని కేటీఆర్ విమర్శించారు. శంషాబాద్లో బీఆర్ఎస్ మైనార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ షాదీ ముబారక్ వంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద రూ.లక్ష ఇస్తే.. మేం అంతకంటే ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూస్తోందని ఆరోపించారు. మైనార్టీ స్కూళ్లను కేసీఆర్ ప్రారంభించారని, వాటితో ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు అవుతున్నారన్నారు. నాలుగు ఉన్న మెడికల్ కాలేజీలు కేసీఆర్ 34కు పెంచారని, విద్యార్థులకు 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చారని, పదేళ్లలో ఎన్నో పనులు చేశారన్నారు. మోదీ స్కూల్లో చదివానని.. చంద్రబాబు కాలేజీకి వెళ్లానని.. రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ బహిరంగంగానే చెబుతున్నారని.. చౌకీదార్ చోర్ అని రాహుల్ అంటే.. రేవంత్ రెడ్డి కాదు కాదు.. ఆయన నా పెద్దన్న అని చెబుతున్నాడన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





