– కేంద్ర మంత్రి రాందాస్
– ఎస్సీ విద్యార్థుల సంక్షేమానికి రూ.150 కోట్లు విడుదల
హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సహకారం అందిస్తోంది. రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథవాలేని టూరిజం ప్లాజాలో కలుసుకొని సమగ్ర వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల పాఠశాలలు, హాస్టళ్లు, వసతిగృహాల ఆధునీకరణ, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్లు, సురక్షిత తాగునీటి సదుపాయాలు, ఆధునిక వంటశాలలు, మరమ్మత్తులు తదితర అవసరాలకు ఆర్థిక సహాయం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అనేక పథకాలు చేపట్టి పనిచేస్తోందని, కానీ కేంద్ర ప్రాయోజిత నిధులు పెండింగ్లో ఉండటం వల్ల అమలుపై ఆర్థిక భారం తప్పడంలేదని తెలియజేశారు.కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు వచ్చే కేంద్ర నిధులలో తొలి విడతగా రూ.150 కోట్లను తక్షణమే విడుదల చేయడానికి సానుకూల స్పందన వ్యక్తపరిచారు. అదేవిధంగా రాష్ట్రం అడిగిన రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ విషయాన్ని వచ్చే నెలలో ప్రత్యేక సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రులు మాట్లాడుతూ ఈ నిధులు రాగానే పాఠశాలలు, హాస్టళ్లలో బేసిక్ సౌకర్యాల్ని మెరుగుపరచి విద్యార్థులకు మరింత సురక్షిత, ఆధునిక విద్యా వాతావరణాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్, సంబంధిత అధికారులూ హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



