మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బిఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంగళవారం సాయంత్రం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ది చెబుతారన్నారు.
స్టేషన్ ఘనపూర్ లోను ఉప ఎన్నిక వొస్తుంది.. కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన ధర్మసాగర్ మాజీ జెడ్పిటిసి కీర్తి వెంకటేశ్వర్లు, మరికొంతమంది నాయకులు చేరారు. ఈ నెల 15న తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందితో చేరికల కార్యక్రమం ఉంటుందని సమాచారం.





