– సీఎం రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలి
– డీజీపీని కోరిన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ను కోరారు. మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమాత్రం ప్రొఫెషనలిజం మిగిలి ఉన్నా వెంటనే సుమోటోగా స్వీకరించి,రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయమని పోలీసులకు ఆదేశించాలని కోరారు. పరిస్థితి చేయి దాటకముందే నివారించాలని విజ్ణప్తి చేశారు.కేసు నమోదు చేయడంపై చట్టంలో ఎక్కడా ముఖ్యమంత్రికి మినహాయింపు ఇవ్వలేదని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటే కేవలం అసెంబ్లీ స్పీకర్కు మాత్రమే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న ఆరోపణ కానే కాదని స్పష్టం చేశారు. రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయి, పంటలు బాగా పండుతాయని ఏకంగా సీఎం సలహా ఇచ్చారని, ఎవరైనా ఆగంతకుడు పంట పొలాల్లో నిద్రిస్తున్న అమాయక రైతులను చంపి షాబాద్ రాజ్కుమార్లా వీడియోలు తీస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్రావుపై, మిగతా అగ్ర నాయకులపై ఆగంతుకులు దాడి చేస్తే పరిస్థితి ఏంటని అడిగారు. ముఖ్యమంత్రే బెల్ట్తో కొట్టమన్నారని చెప్పి భర్తలు తాగొచ్చి భార్యాపిల్లలను బెల్ట్లతో కొడితే, కింది ఉద్యోగులను పై అధికారులు బెల్ట్తో కొడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అగ్ర నాయకుల ద పెట్రోల్ పోసి, తాను కూడా పోసుకుంటానని గతంలో గజ్వేల్లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో కార్యకర్తలను మైనంపల్లి హన్మంతరావు ప్రేరేపించారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. కనీసం ఆయనపై కూడా కేసు నమోదు చేయకుండా పీపీ ఒపీనియన్ తీసుకుని ఇది సివిల్ కేసు అని నాటి సిద్దిపేట పోలీస్ కమిషనర్ చెప్పారని గుర్తుచేశారు. దీన్ని ప్రజలు మరిచిపోయారని అన్నారు. సంగారెడ్డిలో శౌర్య పతాక విజేత ఇన్స్పెక్టర్ శివకుమార్ యాదవ్ అంతు చూస్తానన్న జగ్గారెడ్డికి కనీసం నోటీసులు అయినా ఇచ్చారా అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పోస్టింగ్లు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి.. కానీ పోలీసు వ్యవస్థ శాశ్వతమని తెలిపారు. పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట గురించి, ప్రజలకు జీవించే హక్కు(ఆర్టికల్ 21) గురించి ఆలోచించాలని డీజీపీకి సూచించారు. మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారని, రాజ్యాంగంలోని 311 అధికరణం మిమ్మల్ని కాపాడుతుందని తెలిపారు. అందుకే బీఎస్ఎస్ సెక్షన్ 45ని మళ్లీ చదవాలని కోరారు. దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుని, ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఆయన వివరణతో సంతృప్తి చెందకపోతే కేసు నమోదు చేయాలన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డీజీపీకి ప్రవీణ్ కుమార్ సూచించారు. ఈ రక్తపు భాష ఆగకపోతే రాష్ట్రంలో రక్తపాతం జరిగే ప్రమాదం ఉందని, వేలాదిమంది అమాయకులు బలైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు