– సస్పెండ్ అయిన అధికారి ప్రమోద్ నౌటియాల్ అరెస్ట్
న్యూదిల్లీ, జూలై 14: బద్రీనాథ్ ఆలయ విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు బద్రీనాథ్ – కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ మాజీ వ్యక్తిగత సహాయకుడు, సస్పెండ్ అయిన అధికారి ప్రమోద్ నౌటియాల్ను అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్లోని అతడి నివాసంలో చమోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం అతడిని బద్రీనాథ్కు తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి పోలీసు కస్టడీ కోరనున్నట్లు అధికారులు తెలిపారు. జులై 2వ తేదీన ఆలయ కానుకల లెక్కింపు సమయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో ప్రమోద్ నౌటియాల్ నగదు లెక్కింపు గది నుంచి తన వ్యక్తిగత కార్యాలయానికి పలుమార్లు వెళ్లినట్లు గుర్తించారు. ఈ కేసు విచారణలో రూ.500, రూ.100 నోట్ల కట్టలు, బంగారు, వెండి నాణెళిలు, శాలిగ్రామ శిలలను దాచిపెట్టినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆలయ విరాళాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను, పద్ధతులను పూర్తిగా ఉల్లంఘించినట్లు అంతర్గత నివేదికలో కూడా ప్రాథమికంగా పేర్కొంది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే గర్వాల్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, కేదార్నాథ్ ఆలయ నిధుల వినియోగంలోనూ అక్రమాలు వెలుగుచూశాయి. వీఐపీల వసతి, భోజనాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో మాజీ మేనేజర్, ఇన్చార్జ్ అధికారి, మాజీ సీఈఓలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు తన సస్పెన్షన్, ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ప్రమోద్ నౌటియాల్ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణ 16వ తేదీన జరగనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





