- హైదరాబాద్లో ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: ఎండల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ డిమాండ్ భారీగా నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిందని విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది జూలై రెండు వారాల్లో రోజువారీ విద్యుత్ వినియోగం 61-71 మిలియన్ల యూనిట్ల ఉండగా, ఈ ఏడాది జూలై 11 తేది నాటికి 71-82 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతోంది. నగరంలో సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశాలుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో సోమవారం గరిష్ఠంగా 36.7 డిగ్రీలు, కనిష్ఠం – 25.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో భానుడి భగ.. భగలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. వర్షాకాలం లోనూ వేసవి తరహాలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 1 నుంచి జూలై 13 వరకు హైదరాబాద్ జిల్లాలో సాధారణంగా 175 మిల్లిటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 100.1 మిల్లిటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 43 శాతం తక్కువని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో సాధారణం కంటే 26 శాతం, మేడ్చల్- మల్కాజిగిరిలో 54 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 28 తక్కువ వర్షపాతం ఈ సీజన్లో నమోదైంది. మరో వారం రోజులు భారీ వర్ష సూచనలు కన్పించడం లేదని బేగంపేట సీనియర్ వాతావరణశాఖ అధికారి జీఎన్ఆర్ఎస్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నగరంలో నమోదవుతున్నాయి. మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




