– ఈ స్కాంపై విచారణ కమిటీ వేయాలి
– పెద్ద స్కాంను చిన్నదిగా చూపే యత్నం
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: సెక్రటేరియేట్ ను వేదికగా చేసుకొని రాష్ట్ర ఐటీ శాఖలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ మంత్రి పేషీలో జరిగిన స్కాం విషయంలో కళ్యాణ్రాజ్ ఎపిసోడ్ గత నెల 9న బయటకు వస్తే ఈ నెల 8న కేసు నమోదు చేసి ఆ కేసును సీసీఎస్కు బదిలి చేసినట్లు చెబుతున్నారన్నారు. కేవలం రఘురాంశర్మ దుద్దిళ్ల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఇంత పెద్ద కుంభకోణాన్ని సాధారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది పాత విషయమే.. కొత్తది కాదంటూ రఘురాం శర్మ ప్రకటన చేశారని, రెండు నెలల క్రితం జరిగితే పాతదా అని ప్రశ్నించారు. అయితే రఘురాం శర్మ చెప్పిన తేదీలో ఏ ఒక్క ఎఫ్ఐఆర్ లేదని, జూన్ 3న దరఖాస్తు ఇచ్చిన అని చెబుతున్నారని, కానీ ఆ తేదీన అసలు ఎఫ్ఐఆర్ లేదని ఆయన వివరించారు. మంత్రి పేషీ అడ్డాగా కుంభకోణం నడుస్తున్నదని కళ్యాణ్రాజ్ ఇచ్చిన దరఖాస్తులో స్పష్టంగా ఉందన్నారు. నిందితులుగా గుర్తించిన వారికి మంత్రి వాహన పాస్లు ఉన్నాయని, వారంతా ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వెళ్లిరావచ్చనని తెలిపారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా పత్రికలు మంత్రిపై ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాయని ప్రశ్నించారు. కొన్ని ఆఫీస్లు దందాలకు అడ్డాగా మారిపోయాయని ఆరోపించారు. హైదరాబాద్లో వివిధ కంపెనీల పేరుతో నాలుగు ఆఫీస్లు పెట్టి ఆ ఆఫీస్ల వసూళ్లను సెక్రటేరియట్ వేదికగా నడిపిస్తున్నారనే విషయాన్ని సమాజం గమనించాలన్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క పీఏలపై అనేక ప్రచారాలు చేశారని, సురేఖ పీఏ ఎవరిపై గన్ పెట్టిండో ఎవరికి తెలియదని, సీతక్క పీఏ ఇసుక కుంభకోణమంటూ రాద్దాంతం చేశారన్నారు.ఎస్సీ,ఎస్టీ, బీసీలపై ఇంత దాడులు జరుగుతున్నా సోకాల్డ్ గొప్పవాడిలా చెలామణి అవుతున్న మంత్రి దుద్దిళ్ల మీద ప్రభుత్వానికి, సమాజానికి ఎందుకు ఇంత ప్రేమనో చెప్పాలన్నారు.మంత్రి సోదరుడు సైతం అన్ని జిల్లాల్లో అనేక విషయాల్లో కుంభకోణాలకు పాల్పడుతున్నాడని, ఐటీ కంపెనీ, రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గతంలో కలెక్టర్ నీతు ప్రసాద్ వారధి ద్వారా నిరుద్యోగుల మెరిట్, కాస్ట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చేవారని, కానీ ఈనాడు వారధిని తొలగించి ఓ కంపెనీ ద్వారా ఉద్యోగాలు రూ.లక్షలకు అమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. రామగుండం మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి అలైన్ సెక్యూరిటీ మ్యాన్ పవర్ సర్వీసెస్ అనే కంపెనీని ఎంప్యానల్ చేసి వందమందికి పైగా రూ.5లక్షల చొప్పున తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఆదిలాబాద్,ఆసిఫాబాద్,రాజన్న సిరిసిల్ల,జగిత్యాలతోపాటు అనేక జిల్లాలో మంత్రి సోదరుడు బినామీ కంపెనీ పేరుతో మోసం చేస్తున్నారన్నారు. మంత్రి సోదరుడు మంథనికి వస్తే ఓ మాజీ వార్డు సభ్యుడు వసూళ్లకు పాల్పడి ఆ డబ్బులతో పూలదండలతో సన్మానాలు చేస్తున్నారని, భారీగా వాహనాలతో కాన్వాయ్లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చీకటి వ్యాపారాలు చిన్న చిన్న పత్రికల్లో రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించి ఎవరికి లంచాలు ఇవ్వవద్దని ప్రకటన చేశారని తెలిపారు.మంత్రి పేషీలో జరిగిన కుంభకోణంపై మంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం, ప్రభుత్వం ఖండించలేదంటే పెద్ద కుంభకోణం జరిగిందని అనుమానించాల్సిన అవసరం ఉందని, వెంటనే ప్రభుత్వం ఒక కమిటి వేసి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పత్రికలు ఈ వ్యవహరంపై నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
——————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





