– జూబ్లీహిల్స్ నుంచే బిఆర్ఎస్ జైత్రయాత్ర సాగాలి
– లేదంటే అదే నిర్లక్ష్యంతో పాలన సాగిస్తారు
– పార్టీలో చేరిన వారితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 25: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రెండేళ్లలో కేసీఆర్ని తిట్టడం తప్ప సీఎం రేవంత్రెడ్డి ఏమి చేశారని నిలదీశారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వొచ్చిందని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. మోసాన్ని మోసంతోనే జయించాలని కేటీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేష్ ముదిరాజ్తన అనుచరులతో కలిసి శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో హామీలిచ్చి ఒక్క పైసా కూడా సీఎం రేవంత్రెడ్డి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. వోటు కోసం కాంగ్రెస్ నేతలు ప్రమాణం చేస్తారని, ఆ తర్వాత పట్టించుకోరని ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆర్ని అధికారంలోకి తెచ్చుకోవటానికి జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తాము మోసం చేసినా తమకు వోటు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రులకి మధ్య సయోధ్య లేక కొట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు జాదూగాళ్లు అని దెప్పిపొడిచారు. మైనార్టీ సబ్ ప్లాన్ పెడతామన్నారని, అది కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. వోటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వొస్తే బాకీ కార్డు చూపెట్టాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయి. ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 భోజనం, పింఛన్లు, రంజాన్ తోఫాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసింది. వృద్ధులు, రైతులు, మహిళలు అందరిని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం మోసపోయాం.. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోవద్దు. అందుకే మేం కూడా జూబ్లీహిల్స్కు వచ్చి ప్రచారం చేస్తామని గ్రామాల నుంచి రైతులు, ప్రజలు చెబుతున్నారన్నారు. ప్రజల నిజమైన అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తేవాలి. తెలంగాణలోని గరీబోళ్లు, కార్మికులు, రైతులు అందరూ జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారు. జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. వొచ్చే నెల 11న జరిగే పోలింగ్లో బీఆర్ఎస్కు వోటు వేయాలని కేటీఆర్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





