- భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైనది భూభారతి చట్టం
- రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించామని, దేశానికి రోల్ మోడల్ గా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) అన్నారు. సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాలులో భూభారత్ చట్టం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భూభారతి చట్టంలోని మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా అందులోని అంశాలను గురించి హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్ చదివి వినిపించారు. మండలంలోని రైతులు, ప్రజలు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా వాటికి భూభారతి చట్టం ద్వారా ఉన్న పరిష్కారం మార్గాలను ఆర్డీవో రాథోడ్ రమేష్, స్థానిక తహసీల్దార్ జగత్ సింగ్ వివరించారు. రైతులు ఈ చట్టానికి సంబంధించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చామని, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి రోజున భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. వివిధ రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలను పరిశీలించి, మేధావులు, రైతులు సలహాలు సూచనలతో రూపొందించిన మార్గదర్శకాలతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. దేశంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి అద్భుతమైన చట్టమని అన్నారు. దీని అమలు కోసం రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. భూభారతి చట్టంపై రాష్ట్రంలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలు ఉన్న మీ ఇంటి వద్దకే రెవెన్యూ అధికారులను పంపించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాటిని పరిష్కరిస్తారని అన్నారు.
2020లో వొచ్చిన ధరణి చట్టానికి భూ సమస్యలను పరిష్కరించే ఎలాంటి రూల్స్ లేవన్నారు. ప్రతి భూ సమస్య పరిష్కారానికి భూభారతి చట్టంలో మార్గాలు ఉన్నాయన్నారు. సాదాబైనమా అంశాలను ధరణిలో పొందుపరచలేదన్నారు. ధరణి విషయమై భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల వరకు వెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో అప్పుల భారం ఉన్నా కూడా పేదవాడి కలను సాకారం చేసేందుకు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పేదవారికి చెందిన భూమిని పేదవారికే ఇచ్చేందుకు భూ భారతి చట్టం తోడ్పడుతుందన్నారు. ఏ ఒక్క నిరుపేద రైతన్న ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినవసరం లేదని, మీ ముందుకే అధికారులు వస్తారని అన్నారు. రైతులకు ఒక్క పైసా కూడా ఖర్చు లేనివిధంగా భూ భారతి చట్టం ద్వారా భూ సమస్య పరిష్కారానికి ఉపయోగ పడుతుందన్నారు. అప్లికేషన్ ఫారాన్ని అధికారులే అందజేస్తారని అన్నారు. భూ సమస్యలు శాశ్వతంగా.. సులువుగా పరిష్కారమయ్యే విధంగా భూభారతి చట్టం రూపొందించినట్లు చెప్పారు. ఈనెల 30వ తేదీ నాటికి అన్ని మండలాల్లో భూభారతి చట్టంపై రైతు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని మండలాల్లో భూభారతి చట్టం సదస్సును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 3న ప్రతి రెవెన్యూ గ్రామానికి ప్రతి భూ సమస్యల పరిష్కారానికి చట్టం ద్వారా అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో చట్టాలను అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. అధికారులు ఎక్కడైనా తప్పు చేస్తే చర్యలు ఉంటాయన్నారు. సాదా బైనామా దరఖాస్తులను కూడా భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, 20 లక్షల ఇళ్లను కట్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. మొదటి విడతలో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం అత్యంత నిరుపేదలకు అందిస్తుందన్నారు. సన్న బియ్యం మాదిరిగానే భూభారతి చట్టంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ఎన్ని ఇబ్బందులు ఉన్నా చిత్తశుద్ధితో ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తుందన్నారు. భూభారతి చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు భూమి అంటే ఆత్మగౌరవం..విశ్వాసమని అన్నారు. రైతులకు ఉన్న భూ సమస్యలను పరిష్కరించి హక్కులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సన్న ధాన్యానికి బోనస్ డబ్బులను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించగా గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, తమ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తుందన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నామని, రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన 15 నెలల్లోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పేద ప్రజల ఇళ్లల్లో సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు వచ్చిందన్నారు. వీటితోపాటు గ్రామాలలో మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అన్నారు. భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండాలని ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రైతుకు భూమికి విడదీయని బంధం ఉంటుందన్నారు. ధరణి పోర్టల్ తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం ఎంతోమంది మేధావులు, రైతులు, ఎన్నో వర్గాల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు ఈ చట్టం తయారుచేశారన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రైతులు, ప్రజలు ఈ చట్టంపై పూర్తి అవగాహనను పెంపొందించుకోవాలని కోరారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం గురించి అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ తమ గ్రామాల్లో రైతులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. భూభారతి చట్టంలో భూ సమస్యల పరిష్కారం లభిస్తుందన్నారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. భూ సమస్యలు ఉన్నవారు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకొని వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సబ్సిడీ రూ. 2.50 లక్షల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, ఇతర అధికారులు రైతులు పాల్గొన్నారు.