-ఉద్గమ్ పోర్టల్ ప్రాధాన్యత వివరించాలి
-కలెక్టర్ పమేలా సత్పతి
-కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 1: దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులు(బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు) ను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకు అ వగాహన కల్పించాలని బ్యాంకు, బీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకు, బీమా, నియంత్రణ సంస్థల ప్రతినిధులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆమె మాట్లాడారు. బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు అన్ని వివరాలు పూర్తిగా నింపి నామినీ వివరాలు తప్పనిసరిగా రాయాలన్నారు. పలువురు ఉద్యోగ, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించినప్పుడు వివిధ ఆర్థిక సంస్థల్లో చేసిన ఇన్వెస్ట్ మెంట్లు క్లైమ్ చేయకుండా వదిలేశారన్నారు. దీంతో వారి అడ్రస్, కుటుంబ సభ్యుల వివరాలు తెలియక ఖాతాల్లోనే సొమ్ము ఉండిపోయిందన్నారు. ఆధార్, ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా క్లైమ్ చేయని ఆస్తులు రూ.2లక్షల కోట్లు ఉందని, వీటిని అర్హులైన పౌరులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్గామ్ పోర్టల్ ను ప్రవేశపెట్టిందన్నారు. గుజరాత్ లో అక్టోబర్ 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో దీనిని ప్రారంభించారన్నారు. సంబంధిత బ్యాంకులు, సంస్థల వద్దకు వెళ్లి మీ వద్ద ఉన్న సరైన పత్రాలు సమర్పించి నగదు పొందాలని సూచించారు. డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, గ్రామాల వారీగా స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఈ కార్యక్రమం గురించి వివరించాలని పేర్కొన్నారు. పదేళ్లు ఖాతాను వినియోగించకుండా ఉంటే డెఫ్ ఫండ్ లోకి వెళ్తుందన్నారు. ఎవరైనా వివరాలు సమర్పిస్తే డెఫ్ నుంచి యాక్టివేట్ చేసి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ప్రతినిధులను ఆదేశించారు. నగర పాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా, పీఎఫ్ వంటి వాటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కేవైసీ, ఫోన్ నెంబర్, అడ్రస్, అప్డేట్ చేసుకోవాలని సూచించారు. డీజీఎం సోలంకి మాట్లాడుతూ కలెక్టర్ చొరవతో రెండు నెలల్లో కొన్ని ఖాతాలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఎస్ఎల్ బీసీ చైర్మన్ శ్రీహరి మాట్లాడుతూ.. క్లైమ్ చేయని ఆస్తుల ను అర్హులకు అప్పగించాలనే ఉద్దేశంతో 90 రోజుల క్యాంపెయిన్ ను జిల్లాల వారీగా ప్రారంభించినట్లు వివరించారు. మీ వద్ద ఉన్న వివరాలతో బ్రాంచ్ కి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. యూబీఐ డీజీఎం అపర్ణ రెడ్డి మాట్లాడుతూ క్లైమ్ చేయని ఖాతాదారులను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ మాట్లాడుతూ.. నామినీ పేరు నమోదు చేయకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం పై మరింత అవగాహన పెంచాలన్నారు. ఈ సందర్భంగా ఆవరణలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. పలువురికి సెటిల్మెంట్ లెటర్లు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎస్బీఐ ఏఓ, ఎస్.ఎల్.బి.సి ఏజీఎం జి.ఆర్, శ్రీహరి, యూబీఐ డీజీఎం అపర్ణా రెడ్డి, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ సాయి శెట్టి, ఆర్బీఐ, నాబార్డ్, ఎస్ ఎల్బీసీ, ఎల్డీఎం ఆంజనేయులు, రాయల్ సుందరం, ఈపీఎఫ్ ఓ, బ్యాంకుల అధికార్లు, లబ్దిదార్లు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





