– అహ నా పెళ్లంట తరహాలో రేవంత్ పాలన
– ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన నేతలు
– మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: అహ నా పెళ్లంట సినిమా తరహాలో రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని.. కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు అని.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ తోక కత్తరించేందుకు రెడీగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు వోటేయాలని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ నాయుడు, ఆయన సతీమణి, టీడీపీ నాయకురాలు సుజాతతోపాటు పలువురు నేతలు శనివారం గులాబీ పార్టీలో చేరారు. ఆ నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కేటీఆర్. వేసిన నామినేషన్ విత్డ్రా చేసుకొని మరీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్న ప్రవీణ్కు అభినందనలు తెలిపారు. శ్రీనివాస్ నాయుడు చాలాకాలంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, ఐదేళ్ల కిందటే రావాల్సిన నాయకుడు ఇప్పుడు వొచ్చారని అన్నారు. మన పార్టీ నుంచి గెలిచి మేయర్ అయిన వ్యక్తి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డే ఏ పనులు చేయట్లేదని, ఇక మేయర్ మనకు ఏం పనులు చేస్తుందని దుయ్యబట్టారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని గ్యారెంటీ కార్డులు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ లక్ష ఇస్తే తులం బంగారం కూడా ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. అది ఇవ్వకపోగా మెడలో గొలుసు కూడా లాక్కెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి భార్యకి ఫ్రీ ఇచ్చి భర్త నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు.. ఇలా అన్ని పథకాలు బంద్ అయ్యాయని ఆగ్రహించారు. ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు.. కానీ బెదిరిస్తారా అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ నాశనం చేశారని.. రెండేళ్లలో ఏం మంచి పని చేశారో చెప్పాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కూలగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎస్సీ డిక్లరేషన్ అంటూ నోటికొచ్చిన 420 హామీలు ఇచ్చారని మండిపడ్డారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే దాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు డ్రామా అంటున్నారని, ఒక ఆడబిడ్డ ఏడిస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా అని నిలదీశారు. ఆడబిడ్డను అవమానిస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో మాగంటి సునీత ఘన విజయం సాధించబోతున్నారని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





