జలసాధన ఉద్యమకారుడు దుశ్చర్లపై దాడి

– తలకు తీవ్ర గాయాలు
– సూర్యాపేట జిల్లా మోతే మండలంలో కలకలం
– నిందితుల కోసం పోలీసుల వేట
– సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
– నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

సూర్యాపేట, ప్రజాతంత్ర,ఏప్రిల్ 24 :  జలసాధన కోసం అలుపెర‌గ‌కుండా పోరాడిన తెలంగాణ ఉద్యమకారుడు, పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.  సమాజానికి సేవే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన ఆయనపై దుండగులు దాడి చేయడం పట్ల పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురువారం  మోతే మండలం రాఘవాపురం గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన పూర్వికుల‌ నుంచి వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిని పర్యావరణ పరిరక్షణ కోసం అంకితం చేశారు. పశుపక్ష్యాదుల ప్రాణాల‌ను నిలిపేందుకు జీవ వైవిధ్యాన్ని పెంచేందుకు అనేక ఏళ్లుగా ఆ  ప్రాంతాన్ని ఒక చిన్న అటవీగా మార్చేశారు.
అయితే ఇటీవల కొంద‌రు వ్యక్తులు ఆ అడవిలో చెట్లను నరికివేస్తుండటాన్ని గమనించిన సత్యనారాయణ వారిని అడ్డుకునే యత్నం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం దుండగులు కర్రలు, మారణాయుధాలతో ఆయనపై దాడి చేసినట్లు సమాచారం.  ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన సత్యనారాయణను సమీప ద‌వాఖాన‌కు తరలించారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  ఈ ఘటనపై మోతే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ ఆరా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  ఆయనకు మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.సత్యనారాయణ ఉద్యమ చరిత్ర

1980 దశకంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలు, ఫ్లోరైడ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ‘ జలసాధన సమితి’ పేరిట ఉద్యమాలు ప్రారంభించారు. వందల కిలోమీటర్ల పాదయాత్రలు చేపట్టి ప్రజల్లో చైతన్యం కల్పించారు.  1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో నామినేషన్లు వేయించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.  అలాగే దిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేపట్టి నల్లగొండ ప్రజల సమస్యలను జాతీయస్థాయికి తీసుకెళ్లారు.  అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి దృష్టికి ఫ్లోరైడ్ సమస్యను తీసుకెళ్లి తాగునీటి పైప్‌లైన్‌కు అనుమతులు సాధించడం ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొని తన వంతు పాత్ర పోషించారు. ఇలాంటి ప్రజాహిత నాయకుడిపై దాడి జరగడం పట్ల ప్రజా సంఘాలు, ఉద్యమకారులు తీవ్రంగా ఖండిస్తున్నారు.  బాధ్యులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  అలాగే సత్యనారాయణకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు ఆయన సృష్టించిన పర్యావరణ సంపదను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *